జిల్లాలో ఓటర్లు 24.35 లక్షలు

ABN , First Publish Date - 2020-12-12T04:44:06+05:30 IST

జిల్లాలో 24,35,035 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పురుషులు 11,92,916మంది కాగా, 12,42,119 మంది మహిళలు ఉన్నారు.

జిల్లాలో ఓటర్లు 24.35 లక్షలు

మహిళలే అధికం

నేటి నుంచి ఓటరు నమోదుకు ప్రత్యేక ప్రచార రోజులు


నెల్లూరు(హరనాథపురం/సిటీ), డిసెంబరు 11 : జిల్లాలో 24,35,035 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పురుషులు 11,92,916మంది కాగా, 12,42,119 మంది మహిళలు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే 49,203 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈనెల 15 వరకు ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.


నేటి నుంచి ప్రత్యేక ప్రచార రోజులు


ఓటరు నమోదుకు శని, ఆదివారాల్లో బూత్‌ లెవల్‌ అఽధికారులు పోలింగ్‌ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార రోజులను నిర్వహిస్తున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా, ఫారం 6, ఫారం 7, ఫారం 8, ఫారం 8ఏలతో పోలింగ్‌ కేంద్రాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్‌ లెవల్‌ అధికారులు అందుబాటులో ఉంటారు. ఓటరు నమోదు, పేరు మార్పు, ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మారటం, విదేశాలలో నివసిస్తున్న వారు ఓటరు జాబితాలో పేరు చేర్చటం, ఇప్పటికే ఉన్న జాబితాలోని వివరాల్లో మార్పులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారు. బూత్‌ లెవల్‌ అధికారుల వద్ద ఉన్న జాబితాలో తమ పేర్లు ఉన్నదీ లేనిదీ ఓటర్లు పరిశీలించుకోవచ్చు. వచ్చే జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారు ఈనెల 15లోగా  ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. జనవరి 15న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.


నెల్లూరులో 246 కేంద్రాలు : డీసీపీ 


 తుది ఓటరు జాబితా తయారీలో భాగంగా పౌరుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు శని, ఆదివారాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ, ఏఈఆర్వో కే బాబురావు శుక్రవారం తెలిపారు. ఇప్పటికే ఈ తరహా ప్రత్యేక కేంద్రాలను గడిచిన శని, ఆదివారాల్లో ఏర్పాటు చేయగా ఓటరు నమోదుకు 150 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ శని, ఆదివారాల్లో నగరంలోని 246 పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహించే ప్రత్యేక దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.




Updated Date - 2020-12-12T04:44:06+05:30 IST