తిరుపతి పార్లమెంట్‌ నేతలతో చంద్రబాబు వీడియా కాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2020-12-11T05:02:35+05:30 IST

తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తిరుపతి పార్లమెంట్‌ నేతలతో   చంద్రబాబు వీడియా కాన్ఫరెన్స్‌

నెల్లూరు(ఆంధ్రజ్యోతి)డిసెంబరు 10: తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ నేతలతో  పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 18 నెలల తర్వాత రాష్ట్రలోని తిరుపతి పార్లమెంట్‌కు ఉపఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇందులో టీడీపీ గెలుపు చారిత్రాత్మక అవసరమని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ఎన్నికలనే ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ఏడాదిన్నర పాలనలో వైసీపీ నాయకులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. అన్నిరంగాలలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. ఇప్పటికే అధికార పార్టీ నేతలు అనేక అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీలపై దమణకాండ పెరిగిందని చెప్పారు. డాక్టర్‌ సుధాకర్‌రావ్‌, డాక్టర్‌ అనితారాణి, జడ్జి రామకృష్ణపై దాడులు జరిగాయన్నారు. రాజమండ్రిలో దళిత బాలికపై 12 మంది గ్యాంగ్‌ రేప్‌ మరిచిపోక ముందే పులివెందులలో మరో దళిత మహిళపై అత్యాచారం జరిగిందని తెలిపారు. కర్నూలులో ఎస్టీ మహిళ గ్యాంగ్‌రేప్‌ గురైందన్నారు. గిరిజనులు, ఆదివాసీల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. రాజమండ్రిలో అబ్దుల్‌ సత్తార్‌ ఆత్మహత్యాయత్నం, నెల్లూరులో ముస్లిం మహిళల ఇళ్ల కూల్చివేతలు దారణమన్నారు. 67 ఏళ్ల చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెప్పారు.ఈ నేపఽథ్యంలో తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. 

టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏడాదిన్నర పాలనలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గాల ఫలితంగా అన్ని వర్గాలకు దూరమయిందన్నారు. మహిళలు, ఉద్యోగులు, యువత, కార్మికులు అందరినీ ఈ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు రద్దుచేసి, తినే కంచాల్లో జగన్మోహన్‌రెడ్డి మట్టి చల్లారన్నారు. రేషన్‌కార్డులు తీసేశారని, పింఛన్లు రద్దు చేశారని విమర్శించారు. కిస్మస్‌, సంక్రాంతి, రంజాన్‌ కానుకలను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కాగా తిరుపతి పర్యటన సందర్భంగా టీడీపీ ఎంపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి శ్రీకాళహస్తి ఆలయం, అలిపిరిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - 2020-12-11T05:02:35+05:30 IST