నేడు సమ్మెలోకి బ్యాంకర్లు

ABN , First Publish Date - 2020-11-26T04:46:15+05:30 IST

అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు గురువారం ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొననున్నారు.

నేడు సమ్మెలోకి బ్యాంకర్లు

డిమాండ్ల సాధన కోసం ఆందోళన

మూత పడనున్న 300లకుపైగా శాఖలు 

నెల్లూరు (హరనాథపురం), నవంబరు 25 : అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు గురువారం ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొననున్నారు.  ఈ సమ్మెకు ఏఐబీఈఏ మద్దతు కూడా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 300కుపైగా బ్యాంకులు మూత పడనున్నాయి.

డిమాండ్లు ఇవే..

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించవద్దనే ప్రధాన డిమాండ్‌తో ఉద్యోగులు ఈ సమ్మె చేపడుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని, రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ కార్పొరేట్‌ ఎన్‌పీఏలను వసూలు చేయాలని, డిపాజిట్లపై వడ్డీ పెంచాలని, శాశ్వత ఉద్యోగాలను అవుట్‌ సోర్సింగ్‌ చేయవద్దని, బ్యాంకులలో తగినన్ని నియామకాలు చేపట్టాలని, ఎన్‌పీఎ్‌స రద్దు చేయాలని, కో-ఆపరేటివ్‌ బ్యాంకు ఉద్యోగులతోపాటు డీఏ లింక్‌లేని ఉద్యోగులకు డీఏ లింకు చేయాలని, కోఆపరేటివ్‌ బ్యాంకులు, రీజినల్‌ రూరల్‌ బ్యాంకులను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఎన్‌డీసీసీ ఎదుట నిరసన

పలు డిమాండ్ల పరిష్కారం కోసం ఈ సమ్మె చేస్తున్నాం. నెల్లూరులోని జిల్లా కేంద్రసహకార బ్యాంకు వద్ద గురువారం నిరసన ప్రదర్శన చేపడుతున్నాం. బ్యాంకు ఉద్యోగులందరూ ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం. 

- వి.ఉదయ్‌కుమార్‌, జిల్లాకార్యదర్శి, ఏఐబీఈఏ

Updated Date - 2020-11-26T04:46:15+05:30 IST