రూపాయి ఇస్తున్నారు.. పది రూపాయలు లాక్కుంటున్నారు
ABN , First Publish Date - 2020-12-08T01:30:07+05:30 IST
ప్రభుత్వం పేదలకు ఓ చేత్తో రూపాయి ఇస్తూ మరో చేత్తో పది రూపాయలు లాక్కుంటోందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విమర్శించారు.

ప్రభుత్వంపై మండిపడ్డ అజీజ్
తెలుగు మహిళల ఆధ్వర్యంలో వంట - వార్పు
నెల్లూరు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం పేదలకు ఓ చేత్తో రూపాయి ఇస్తూ మరో చేత్తో పది రూపాయలు లాక్కుంటోందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విమర్శించారు. పెరిగిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో వేదాయపాళెంలో సోమవారం వంట - వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చినప్పటి నుంచి నష్టాలతో జనాలు అల్లాడుతుంటే ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి వారిని మరింత దోచుకుంటోందని మండిపడ్డారు. పెట్రోలు ధరలు, నీటి పన్నులు, ఇంటి పన్నులు పెంచి పేదలపై మోయలేని భారాన్ని మోపుతోందన్నారు. టీడీపీ హయాంలో గ్యాస్ ధర రూ.570 ఉంటే ఇప్పుడు రూ.750 అయ్యిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పనబాక భూలక్ష్మి, కోమరి విజయ, రేవతి, రోజారాణి, శైలజమ్మ, బీవీ లక్ష్మి, మల్లి నిర్మల, అబీద సుల్తానా, మస్తాన్బీ, పద్మమ్మ, రాజేశ్వరి, రామ తులసి తదితరులు పాల్గొన్నారు.