కరోనా నివారణకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2020-04-01T11:01:18+05:30 IST

జిల్లాలో కరోనా నివారణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని

కరోనా నివారణకు పటిష్ట చర్యలు

అందుబాటులోకి ఐదువేల పడకలు

సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని

అధికారుల తీరుపై అసంతృప్తి

సాధారణ వైద్యం, ఇతర సమస్యలపై దృష్టి పెట్టండి

ఎమ్యెల్సీలు, ఎమ్మెల్యేల డిమాండ్‌ 


నెల్లూరు (వైద్యం)మార్చి 31 : జిల్లాలో కరోనా నివారణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలియచేశారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో వైద్యశాఖ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో  కరోనా  అను మానితులు ఉంటే  వెంటనే గుర్తించి, వైద్య పరీక్షలు చేయాల న్నారు. వైద్యులు, సిబ్బందికి  బాడీ మాస్క్‌లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.


పారిశుధ్య చర్యలు తీసుకుంటున్నారా..?

 మొదటి పాజిటివ్‌ కేసు వచ్చిన యువకుడి నివాసానికి 3 కిలోమీటర్ల వరకు ప్రత్యేక పారిశుధ్య చర్యలు తీసుకున్నారా లేదా అంటూ నాని ప్రశ్నించారు. జిల్లాలో ఐదువేల క్వారంటైన్‌ పడకలను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి అనిల్‌ మాట్లాడుతూ 7500 పడకలకు కృషి చేస్తున్నామని  చెప్పారు.


వెంటిలేటర్లు అవసరం : అనిల్‌

జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ  జిల్లాకు 140 వెంటిలేటర్లు కావాలని, ప్రస్తుతం 70 అందుబాటులో ఉన్నాయన్నారు.  వెంటనే మిగతావాటి మంజూరుకు చర్యలు తీసుకుంటానని  మంత్రి నాని తెలిపా రు. నిత్యావసరాల ధరల నియంత్రణకు మంత్రులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు.


సాధారణ రోగులు,  రైతులు మాటేమిటి ?

సమీక్షలో ఎమ్యెల్సీలు, ఎమ్మెల్యేలు పలు సమస్యలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 65 శాతం ప్రైవేట్‌ ఆసుపత్రులు మూతపడటంతో సాధారణ రోగులు పరిస్ధితి అగమ్యగోచరంగా మారిందన్నారు. మలేరియా మందులు కూడా మార్కెట్‌లో లేవన్నారు. పారిశుధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జీజీహెచ్‌లోని సెక్యూరిటీ గార్డులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.   ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతుల పండించిన ధాన్యం అమ్ముకోలేక కళ్లాల్లోనే ఉంచుకుఉంటున్నారని, వారిని ఆదుకోవాలన్నారు. 


అధికారుల తీరుపై అసంతృప్తి

సమీక్షలో అధికారులపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు, ఇంకెంతమంది రావాలి..? అన్న ప్రశ్నకు అధికారులు తలో లెక్క చెప్పటంతో మంత్రి  అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కొంత వరకు వివరాలు చెప్పినా, క్షేత్ర స్థాయిలో స్వీయ గృహనిర్భంధంలో ఎంత మంది ఉన్నారు. .క్వారంటైన్‌లో ఎంతమంది ఉన్నారో..? వైద్యాధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వరప్రసాద్‌, కలెక్టర్‌ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌, జేసీ వినోధ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-04-01T11:01:18+05:30 IST