పడకల కొరతతో సతమతం!
ABN , First Publish Date - 2020-08-03T10:50:04+05:30 IST
కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో సమస్యలు పెరిగిపోతున్నాయి.
పెరుగుతున్న పాజిటివ్ కేసులు
అగమ్యగోచర స్థితిలో బాధితులు
గూడూరు, ఆగస్టు 2: కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో సమస్యలు పెరిగిపోతున్నాయి. వైరస్ కంటే చికిత్సపైనే ప్రజల్లో ఆందోళన అధికంగా ఉంది. జిల్లాలో ప్రభుత్వ, ఆసుపత్రులతోపాటు ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చినట్లు అధికారులు ప్రకటించినా, వాస్తవంగా ప్రముఖ ఆసుపత్రులేవీ చికిత్స అందించిన దాఖలాలు లేవు. కరోనా పీడితులెవరైనా ఆయా ఆస్పత్రులకు వెళ్లినా చికిత్స అందించేందుకు వారు నిరాకరిస్తున్నారు. దీంతో తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సివస్తోందని బాధితులు వాపోతున్నారు.
డబుల్ సెంచరీకి పైనే...
గూడూరు పట్టణంలో ఒక కేసు వచ్చేందుకు నెలరోజులు పట్టగా 200 కేసుల మార్కు దాటేందుకు నెల రోజులు పట్టింది. ఏప్రిల్ 5న తొలికేసు నమోదు కాగా జూలై 31కి 224 కేసులు నమోదయ్యాయి. ఒక్క జూలై 31న 68కేసులు నమోదుకావడంతో ప్రజల్లో టెన్షన్ మొదలైంది. కోవిడ్ ఆస్పత్రుల్లో చాలినన్ని పడకలు లేకపోవడంతో ఎక్కువ మంది హోమ్ క్వారంటైన్కు పరిమితమవుతున్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల సంఖ్య పెంచడంతోపాటు పడకల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.