ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని జిల్లాకు రప్పించండి

ABN , First Publish Date - 2020-05-10T07:37:47+05:30 IST

ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని జిల్లాకు రప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అధికారులకు సూచించారు. నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు

ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని జిల్లాకు రప్పించండి

కరోనా నియంత్రణలో అధికారులు కృషి అభినందనీయం

సమీక్షలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌


నెల్లూరు(వైద్యం) మే 9 : ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని జిల్లాకు రప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అధికారులకు సూచించారు. నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కారణంగా ఢిల్లీలోని జమాత్‌ సభలకు వెళ్లిన 74 మంది  అక్కడే చిక్కుకున్నారని,  బ్యాంక్‌ పోటీ పరీక్షల కోచింగ్‌కు వెళ్లిన  విద్యార్థులు కర్నూల్‌లో ఉన్నారని  తెలిపారు. వారిని జిల్లాకు తీసుకు వచ్చాక ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉంచాలన్నారు. 


జిల్లాలో కరోనా నియంత్రణకు కలెక్టర్‌, ఎస్పీ, రెవెన్యూ, పోలీసు, పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. బీహార్‌కు చెందిన 1200 మంది వలస కూలీలను ఇప్పటికే వారి స్వస్థలాలకు పంపించామని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో చర్చించి ఆయా రాష్ట్రాల వలస కార్మికులను కూడా పంపిస్తామని చెప్పారు. మరో రెండు రోజుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు న్విహించే ల్యాబ్‌ అందుబాటులో వస్తుందన్నారు. దీంతో రోజుకు 300 నమూనాలకు పరీక్షలు చేయవచ్చన్నారు. కలెక్టర్‌ శేషగిరిబాబు మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కోయంబేడు కూరగాయల మార్కెట్‌ కేంద్రంగా కరోనా కేసులు వెలుగు చూడటంతో వ్యాపారులు, లారీ డ్రైవర్ల వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బాపిరెడ్డి, జడ్పీ సీఈవో సుశీల, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డీఆర్‌వో మల్లికార్జున, డీపీవో ధనలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-10T07:37:47+05:30 IST