ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలి

ABN , First Publish Date - 2020-11-26T04:52:29+05:30 IST

‘నివర్‌’ ప్రభావం జిల్లాలో మూడురోజులపాటు ఉంటుందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు చెప్పారు.

ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలి

సహాయక చర్యల కోసం 4 ప్రత్యేక బృందాలు

కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెల్లడి

నెల్లూరు(హరనాథఫురం), నవంబరు 25 : ‘నివర్‌’ ప్రభావం జిల్లాలో మూడురోజులపాటు ఉంటుందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుఫాన్‌ తీరం దాటిన తరువాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. సహాయక చర్యల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 12 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేకాధికారులు వెళ్లారని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. ఈతగాళ్లతోపాటు వాకీటాకీలు, పడవలను సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో 1600 చెరువులు ఉండగా, వీటిలో 68 శాతం నీరు చేరిందని చెప్పారు. నిండుగా ఉన్న చెరువుల్లోని నీటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకొన్నామన్నారు.  వంద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన, వసతి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైద్యశాలలు, పీహెచ్‌సీలలో జనరేటర్లను ఏర్పాటు చేయడంతోపాటు డాక్టర్లు, సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. ఐఎండీ, షార్‌, ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు నివార్‌ జాగ్రత్తలపై సమాచారం అందుతోందన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్‌ రూంకు  (నెం.1077) తెలియజేయాలని కోరారు. వర్షాలకు  రోడ్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతు చేయడానికి ఎక్స్‌కవేటర్లు, ఇతర యంత్రాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. తుఫాన్‌ ప్రభావంతో మూడు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. 

Updated Date - 2020-11-26T04:52:29+05:30 IST