శివారు కాలనీల్లో రోడ్లు అధ్వానం!
ABN , First Publish Date - 2020-12-30T03:55:17+05:30 IST
రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు నివాసాలుండే పట్టణ శివారు కాలనీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.
పేదల కాలనీలపై పెద్దల చిన్నచూపు
అవస్థలు పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు, పాలకులు
కావలి రూరల్, డిసెంబరు 29: రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు నివాసాలుండే పట్టణ శివారు కాలనీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ కాలనీల అభివృద్ధిపై పెద్దలు, పాలకులు, అధికారులు చిన్నచూపు చూడడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసునూరు ఇందిరమ్మ కాలనీ, వినాయక కాలనీ, వికలాంగుల కాలనీ, అట్టల ఫ్యాక్టరీ కాలనీ, బాలకృష్ణారెడ్డి నగర్ తదితర కాలనీలల్లో అంతర్గత రోడ్లపై ప్రయాణం దుర్భరంగా ఉంది. ఈ కాలనీలు ఏర్పడి సుమారు 15 ఏళ్లు అయినప్పటికి నేటికీ రోడ్లు లేకపోవటం పాలకుల పనితీరుకు నిదర్శనం. కాలనీలకు వచ్చే ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు మట్టి రోడ్లు కావటంతో చినుకురాలినా రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. వర్షాకాలంలో జలమయమై ద్విచక్ర వాహనాలు సైతం బురదలో కూరుకుపోతున్నాయి. దీంతో ఆయా కాలనీల్లో నివిశించే వేలాది మంది ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా మాతల రాతలు మారటం లేదని, ఎన్నికల సమయంలో నేతల మాటలు నీటిమీద రాతలుగా మారుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాలకులు స్పందించి కాలనీలకు వెళ్లే ప్రధాన రోడ్లతో పాటు కాలనీల్లోని అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
