టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం

ABN , First Publish Date - 2020-11-22T04:42:01+05:30 IST

రాష్ట్రంలో టీడీపీని తిరిగి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా త్వరలో పార్టీలో పెనుమార్పులు చేపడుతున్నట్లు ఆపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పేర్కొన్నారు.

టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం
మాట్లాడుతున్న బీద రవిచంద్ర

ఎమ్మెల్సీ బీద రవిచంద్ర

కావలి, నవంబరు 21: రాష్ట్రంలో టీడీపీని తిరిగి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా త్వరలో పార్టీలో పెనుమార్పులు చేపడుతున్నట్లు ఆపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భవించి 2022-23వ సంవత్సరానికి 40 ఏళ్లు పూర్తి అవుతున్నందున, పార్టీ వ్యస్థాపకుడు ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకుని ఆ నాటికి గెలుపే ధ్యేయంగా చర్యలు చేపటుతున్నట్లు తెలిపారు. కావలి జర్నలి్‌స్టక్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రవిచంద్ర మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేందుకు కొన్ని కీలకనిర్ణయాలు తీసుకుంటుందని ఆ నిర్ణయాలకు అనుకూలంగా కొందరు త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. అధికారపార్టీ ఒత్తిళ్లను తట్టుకుని పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకు చాలా కష్టపడాలని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమానికి మించి జగన్‌ అడిగిన ఒక్క అవకాశానికి ఓటర్లు మొగ్గుచూపారన్నారు. 

గ్రూపుల సమస్య లేదు..

కావలి నియోజకవర్గంలో టీడీపీలో గ్రూపుల సమస్య లేదని, పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, త్వరలో అధిష్ఠానం ఆ సమస్యలను సరిదిద్ది ఇన్‌చార్జి సమస్యలను పరిష్కరిస్తుందని విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కావలిలో విస్ణువర్ధన్‌రెడ్డి కాదని ఎవరూ చెప్పలేదని, ఇన్‌చార్జి కోసం ఎవరూ పోటీపడటం లేదని, ఇక్కడ సమస్యలు  పరిష్కారం కోసం ఎరిక్షన్‌బాబును సమన్వయకర్తగా పార్టీ నియమించిందన్నారు. తన సోదరుడు బీద మస్తాన్‌రావు పార్టీని వీడిపోవటంతో పార్టీతో పాటు వ్యక్తిగతంగా తనకు కొంత నష్టం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లాల పెంపు కార్యక్రమం చేపడుతున్నందున కావలి జిల్లా చేసేందుకు తమవంతు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు, పమిడి రవికుమార్‌ చౌదరి, మలిశెట్టి వెంకటేశ్వర్లు, మన్నవ రవిచంద్ర, గ్రంధి యానాదిశెట్టి, గుంటుపల్లి రాజకుమార్‌ చౌదరి, మొగిలి కల్లయ్య, కాకి ప్రసాద్‌, వెంకటేశ్వర్లు, దేవకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T04:42:01+05:30 IST