కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టండి
ABN , First Publish Date - 2020-04-26T10:30:07+05:30 IST
కరోనా నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర జలవనరులు, పరిశ్రమల శాఖల మంత్రులు అనిల్ కుమార్యాదవ్, మేకపాటి గౌతంరెడ్డిలు ఆదేశించారు.

క్వారంటైన్లో ఉన్న బాధితులను సంరక్షించాలి
గ్రామ కార్యదర్శులు, వలంటీర్లకు సహకారం అందించాలి
అధికారుల సమీక్షలో మంత్రులు అనీల్, గౌతంరెడ్డి
నెల్లూరు(వైద్యం)ఏప్రిల్ 25 : కరోనా నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర జలవనరులు, పరిశ్రమల శాఖల మంత్రులు అనిల్ కుమార్యాదవ్, మేకపాటి గౌతంరెడ్డిలు ఆదేశించారు. శనివారం జడ్పీ ఎమర్జెన్సీ సెంటర్లో అధికారులతో కరోనాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణలో గ్రామ కార్యదర్శులు, వలంటీర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారికి కరోనా రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వలంటీర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు ప్రతిరోజూ తగినన్ని మాస్క్లు, గ్లౌజులు సరఫరా చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లను గుర్తించి వారికి రేషన్, నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ క్వారంటైన్లో ఉన్న బాధితులకు పౌష్టికాహారం, మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో క్వారంటైన్లలో తగిన వసతులు కల్పించాలన్నారు. 14 రోజులపాటు క్వారంటైన్లో ఉన్న వారికి వైద్య పరీక్షలు చేసి ఇంటికి పంపించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్వో మల్లికార్జున, నుడా వైస్ చైర్మన్ బాపిరెడ్డి, డీపీవో ధనలక్ష్మి, పౌరసరఫరాల అధికారి బాలకృష్ణారావ్, మెప్మా పీడీ రమేష్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ జీవపుత్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో మరో 15 మంది డిశ్చార్జి
కరోనా పాజిటివ్ బాధితుల్లో కోలుకున్న 15 మందిని మరో మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని మంత్రి అనిల్కుమార్ వెల్లడించారు. కరోనా నిర్థారణ పరీక్షల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. నెల్లూరు జడ్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు.