ఓపెన్ స్కూల్కు ఆదరణ కరువు
ABN , First Publish Date - 2020-11-26T05:05:58+05:30 IST
ఈ ఏడాది ఓపెన్ స్కూల్కు ఆదరణ కరువైంది. కరోనా పుణ్యమా అని గత విద్యా సంవత్సరం ఓపెన్ స్కూల్కు దరఖాస్తు చేసుకున్న పదో తరగతి, ఇంటర్ అభ్యర్థులు అందరూ పాస్ అయ్యారు.
జిల్లాలో 6వేల సీట్లు అందుబాటులో..
దరఖాస్తు చేసుకున్నవారు 491 మందే
గతేడాది 5651 మంది..
నెల్లూరు(స్టోన్హౌస్పేట)నవంబరు 25 : ఈ ఏడాది ఓపెన్ స్కూల్కు ఆదరణ కరువైంది. కరోనా పుణ్యమా అని గత విద్యా సంవత్సరం ఓపెన్ స్కూల్కు దరఖాస్తు చేసుకున్న పదో తరగతి, ఇంటర్ అభ్యర్థులు అందరూ పాస్ అయ్యారు. ప్రభుత్వం ఆయా పరీక్షలను రద్దు చేసి అంతా పాస్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆల్ పాస్తో ఈ ఏడాది ఓపెన్ స్కూల్కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటారని అందరూ భావించారు. ఇప్పటికే దరఖాస్తుల నమోదు గడువును ప్రభుత్వం పెంచినా వాటి సంఖ్య నామమాత్రంగా ఉంది. జిల్లాలో 56 ఓపెన్ స్కూల్ కేంద్రాలున్నాయి. వాటిలో పది, ఇంటర్లకు కలిపి 6000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు పదో తరగతికి 268, ఇంటర్కు 223 మొత్తం 491 దరఖాస్తులు మాత్రమే అందాయి. దీనినిబట్టి ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లకు ఏ మాత్రం ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
గడువు పొడిగించారు..దరఖాస్తు చేసుకోండి
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువును పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా వచ్చేనెల 5వ తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు తమ పనులు చేసుకుంటూ ఆదివారం పూట తరగతులకు హాజరై పదో తరగతి, ఇంటర్ ఉతీర్ణత సాధించే అవకాశం ఉంది. సందేహాల నివృత్తి కోసం 9100555818ను సంప్రదించాలి.
- రమణారెడ్డి, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్