వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు పర్యటన
ABN , First Publish Date - 2020-12-02T04:16:50+05:30 IST
పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాలైన పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీ, శివరామసుబ్బయ్య గిరిజన కాలనీ, వెంగళరావు నగర్ తదితర ప్రాంతాల్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్ బీ.శివారెడ్డి, డీఈ శ్రీనివాసరావు సిబ్బందతో కలిసి పర్యటించారు.

కావలి, డిసెంబరు 1: పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాలైన పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీ, శివరామసుబ్బయ్య గిరిజన కాలనీ, వెంగళరావు నగర్ తదితర ప్రాంతాల్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్ బీ.శివారెడ్డి, డీఈ శ్రీనివాసరావు సిబ్బందతో కలిసి పర్యటించారు. భారీ వర్షాలతో జరిగిన నష్టాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. పారిశుధ్యం నిర్వహణ, చెత్తసేకరణను పరిశీలించారు. శివరామసుబ్బయ్య గిరిజన కాలనీలో రోడ్లు, తాగునీటి సమస్య, వెంగళరావునగర్లో పందుల సమస్య ఉందని స్థానికులు అధికారుల దృష్టికి తెచ్చారు. స్పందించిన కమిషనర్ పందుల యజమానులను పిలిపించి మాట్లాడుతూ పట్టణానికి దూరంగా ఫారంలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
తెగిన రోడ్డుకు మరమ్మతులపై సందిగ్ధం
పట్టణంలోని ముసునూరు ఇందిరమ్మకాలనీలో తెగిన రోడ్డును మంగళవారం మున్సిపల్ కమిషనర్ బీ. శివారెడ్డి, డీఈ శ్రీనివారావు పరిశీలించారు. గండిపడిన చోట పైపులు వేసి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. అయితే పక్కన లేఅవుట్ల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ తూములు వేస్తే పైనుంచి వచ్చే వర్షపు నీరంతా మా ప్లాట్ల మీదుగా వెళ్లితే అవి కోసుకుపోతాయని అంటున్నారు. ఎలాంటి తూములు వేయకుండా గండి పూడ్చమంటున్నారు. అయితే వర్షపు నీరు పోయేందుకు మార్గం లేకుండా గండి పూడ్చితే మళ్లీ వర్షం వస్తే రోడ్డు తెగిపోతుంది. దీంతో గండి పూడ్చే విషయంలో సందిగ్ధంలో పడ్డారు.