అక్రమార్కులు ఎవరు?
ABN , First Publish Date - 2020-10-13T12:07:14+05:30 IST
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల పనితీరుపై విచారణ కొనసాగుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు, జనరల్ ఫండ్ దుర్వినియోగం జరగడంతోపాటు తాగునీటి సరఫరా, కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు పంచాయతీ కార్యదర్శులపై ఫిర్యాదులు రావడంతో గతంలో అధికారులు విచారణ జరిపారు.
![అక్రమార్కులు ఎవరు?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పంచాయతీల్లో ముమ్మరంగా విచారణ
నెల్లూరు (జడ్పీ), అక్టోబరు 12: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల పనితీరుపై విచారణ కొనసాగుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు, జనరల్ ఫండ్ దుర్వినియోగం జరగడంతోపాటు తాగునీటి సరఫరా, కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు పంచాయతీ కార్యదర్శులపై ఫిర్యాదులు రావడంతో గతంలో అధికారులు విచారణ జరిపారు. వారంతా తప్పు చేసినట్లు తేలడంతో 15 మందిని సస్పెండ్ చేయడం, షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 940 పంచాయతీల్లో పూర్తిస్థాయి విచారణ జరపాలని జాయింట్ కలెక్టర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో డీఎల్పీవోలు, ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విచారణ ముమ్మరంగా సాగిస్తున్నారు. త్వరలో నివేదికలు ఇస్తారని సమాచారం. ఈ క్రమంలో ఎవరెవరిపై వేటు పడుతుందోనన్న ఆందోళన పంచాయతీ కార్యదర్శుల్లో నెలకొంది. కొందరు రాజకీయ, ఆర్థిక బలంతో అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.