చెరువులకు ‘గంగ’ విడుదల
ABN , First Publish Date - 2020-10-04T07:06:33+05:30 IST
కండలేరు డ్యాం నుంచి తెలుగుగంగ ఎడమ కాలువ ద్వారా చెరువులకు సాగునీరు విడుదల చేస్తున్నారు.
వరి సాగుకు అనుకూలం
అధికారుల పర్యవేక్షణ
పొదలకూరురూరల్, అక్టోబరు 3: కండలేరు డ్యాం నుంచి తెలుగుగంగ ఎడమ కాలువ ద్వారా చెరువులకు సాగునీరు విడుదల చేస్తున్నారు. ఈ కాలువ కింద చేజర్ల, పొదలకూరు, నెల్లూరురూరల్ మండలాల పరిధిలో 32 చెరువులు ఉన్నాయి. నాయకుల ప్రమేయం లేకుండా తెలుగుగంగ అధికారుల పర్యవేక్షణలో రోజుకు వంద క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. చెరువుల కింద వరి నార్లు పోసుకోవడానికి అనుకూలంగా ప్రతి చెరువుకు నీటిని మళ్లిస్తున్నారు.
పూర్తి మెట్ట ప్రాంతమైన పొదలకూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో వరి సాగు నామమాత్రంగా ఉండేది. మినుము, పెసర, జొన్న పైర్లకు ఈ ప్రాంతం అనుకూలం. చెరువుల కింద సాగు చేసిన వరిపైరు మాత్రం ఇంటికి చేరే వరకు సందేహమే. ఆఖరు తడి అందక పైరును వదులుకున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత రైతులను ఆదుకోవడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా 2005లో కాలువ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. దీంతో దశాబ్దాల కర్షకుల కల సాకారమైంది.
వరుణుడిపై భారం వేసి సాగు చేసే పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఈ ప్రాంతంలో నిమ్మతోటలు అధికంగా సాగు చేస్తున్నారు. ఈ కాలువ ద్వారా నిమ్మతోటలకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంది. దీంతోపాటుగా నిమ్మ చెట్లలో అంతర పంటలు సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. ఈ కాలువ ఆయకట్టు విస్తీర్ణం 20,700 ఎకరాలు. అయితే ఈ ఎడమ కాలువ హైలెవల్లో ఉండడంతో డ్యాంలో 30 టీఎంసీల పైచిలుకు నీరుంటేనే నీటి సరఫరా అయ్యేది. దీంతో గత ప్రభుత్వ హయాంలో రూ.52 కోట్లతో పంపింగ్ స్కీంను ఏర్పాటు చేశారు. ఈ స్కీం ద్వారా రోజుకు 150 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది.
ఇప్పటి వరకు కాలువకు పంపింగ్ ద్వారా నీటిని సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం డ్యాంలో 47 టీఎంసీల నీరుండడంతో పంపింగ్తో పనిలేకుండా నీరు సరఫరా అవుతోంది. గంగ కాలువకు 50 రోజులు ముందుగా నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పులికల్లు, అంకుపల్లి, ఆర్వైపాళెం, కనుపర్తి, మొగళ్లూరు, ఊచపల్లి, నరసింహకండ్రిగ, చిట్టేపల్లి, పొదలకూరు, అయ్యగారిపాళెం, తోడేరు, మరుపూరు, చాటగొట్ల, బిరదవోలు, మర్రిపల్లి, పార్లపల్లి చెరువులకు నీరందుతోంది. ఈ ఏడు నీరు సమృద్ధిగా లభ్యం అవుతుండడంతో ఈ రబీలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.