జలదిగ్భంధం
ABN , First Publish Date - 2020-11-27T04:46:30+05:30 IST
కోట మండలంలో పలు గ్రామా లు జలదిగ్భంధంలో చిక్కుకోగా 25 మూగ జీవాలు చనిపోయాయి. పలు చోట్ల విద్యుత్ స్థంభాలు, చెట్లు విరిగి పడిపోయాయి.

కోట, నవంబరు 26 : కోట మండలంలో పలు గ్రామా లు జలదిగ్భంధంలో చిక్కుకోగా 25 మూగ జీవాలు చనిపోయాయి. పలు చోట్ల విద్యుత్ స్థంభాలు, చెట్లు విరిగి పడిపోయాయి. తిరుపతి లోని కళ్యాణి డ్యాం గేట్లు ఎత్తడంతో స్వర్ణముఖి నది నిండుకుండను తలపించింది. గూడలి చప్టా వద్ద వరద నీరు పొంగి పారుతుండడంతో కోట, నాయుడుపేట మార్గం లో రాకపోకలు ఆగిపోయాయి. తిన్నెలపూడి, క్రాస్ రోడ్డు వద్ద వున్న స్వర్ణముఖి, చల్లకాలువలను కలిపే ప్రధాన కలుజు పరవళ్ళు తొక్కింది. నారు మడులు నీట మునిగిపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. విద్యానగర్ చల్లకాలువ మార్గ మధ్యంలో నీరు నిలచిపోవడంతో ఎంపీడీవో భవాని, ప్రత్యేక అధికారి సురేష్బాబు, పంచాయతీ విస్తరణ అధికారి ఎస్ కిరణ్కుమార్, కార్యదర్శులు పెద్దమస్తానయ్య, రాజశేఖర్లు ఆధ్వర్యంలో జేసీబీ ద్వారా కాలువలు తవ్వించి నీటిని చల్లకాలువలోకి పంపారు. దీంతో రాకపోకలు కొనసాగాయి.
వాకాడు : దుగ్గరాజపట్నం, తిరుమూరు, కోడివాక, కొండూరు, రావిగుంట తదితర గ్రామాలో దాదాపు 12 వందల ఎకరాల వరకు వరి పొలాలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అధికారి విజయభారతి గురువారం తెలిపారు. దుగ్గరాజపట్నంలో పలువురు రైతులు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఎమ్మెల్యే పర్యటన
వాకాడు/చిల్లకూరు : అంజిలాపురం, దుగ్గరాజపట్నం ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్రావు పర్యటించి భరోసా కల్పించారు. ప్రతి బాధితుడికి నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ముంగమూరు శరత్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. నెలబల్లిరెట్టపల్లి గ్రామంలో వరదనీటితో మునిగిన చప్టాను ఎమ్మెల్యే వరప్రసాద్రావు పరిశీలించారు. ఈ చప్టాపై శాశ్వత నిర్మాణాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులురెడ్డి, ఇరిగేషన్ఏఈ మస్తానయ్య, ఎస్ఐ బాబి, నాయకులు అన్నంరెడ్డి పరంధామరెడ్డి, మన్నెం శ్రీనివాసులు, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పునరావాస కేంద్రాల్లో వసతులు ఏర్పాటు
వాకాడు : మొనపాళెం గ్రామంలోని 60 కుటుంబాలకు గురువారం ఎంపీడీవో గోపినాథ్ పాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ చేయూతనందించారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు వెంకటరత్నం, పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
