జాతీయ రహదారిపై ‘వర్రీ’

ABN , First Publish Date - 2020-11-28T05:10:35+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జాతీయ రహదారిపై గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు వణికించే చలి, ఆకలితో అవస్థలు పడ్డారు.

జాతీయ రహదారిపై ‘వర్రీ’
తాత్కాలిక రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ

 స్థంభించిన జాతీయరహదారి

 30 గంటలు నడిరోడ్డు మీద ప్రయాణికులు

 శ్రమించిన అధికారులు

గూడూరు, నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జాతీయ రహదారిపై   గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు వణికించే చలి, ఆకలితో అవస్థలు పడ్డారు.  గూడూరు పట్టణ సమీపంలో జాతీయరహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీంతో సర్వీసు రోడ్లు ఏర్పాటు చేసి ప్రధాన రహదారులను తొలగించారు. తుఫాను కారణంగా వరదనీరు సర్వీసు రోడ్లపై ప్రవహించడంతో గురువారం ఉదయం ట్రాఫిక్‌ను నిలిపివేసి కేవలం బస్సులు, లారీలను మాత్రమే అనుమతించారు. సాయంత్రానికి ప్రవాహ ఉధృతి పెరగడంతో అన్ని వాహనాలను నిలిపివేశారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గూడూరు పట్టణ, సమీప ప్రజలు మాత్రం కృష్ణపట్నం పోర్టు మీదుగా నెల్లూరుకు రాకపోకలు సాగించారు. గంటల తరబడి బస్సులు, లారీలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఒక వైపు వర్షపు జల్లులు, మరో వైపు గాఢాంధకారంలో జాతీయ రహదారిపై పడిగాపులు కాశారు. 

Updated Date - 2020-11-28T05:10:35+05:30 IST