ముంపు ప్రాంతాల్లో కలెక్టర్!
ABN , First Publish Date - 2020-12-02T04:58:34+05:30 IST
కావలి, బోగోలు మండలాల్లోని ముంపు ప్రాంతాలను మంగళవారం కలెక్టర్ చక్రధర్బాబు పరిశీలించారు.

బిట్రగుంట డిసెంబరు 1 : కావలి, బోగోలు మండలాల్లోని ముంపు ప్రాంతాలను మంగళవారం కలెక్టర్ చక్రధర్బాబు పరిశీలించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డితో కలిసి ఆయన దెబ్బతిన్న రోడ్లను, పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. బోగోలు మండలం తిప్ప మీదుగా ఉడ్హౌస్పేట వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటంతో వెనుతిరిగారు. తెల్లగుంట, ఉమామహేశ్వరపురం రైతులు కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జాతీయ రహదారి నుంచి ముంగమూరు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు ఆరు అడుగుల లోతున కోతకు గురైనట్లు గుర్తించారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రతిసారి ముంగమూరు, తెల్లగుంట, అల్లిమడుగు, కడనూతల ఉమామహేశ్వరపురం, ఎస్వీపాలెం పొలాలు ముంపునకు గురవుతున్నాయని ఎమ్మెల్యే రామిరెడ్డి కలెక్టర్కు వివరించారు.
ఆదుకుంటాం
తుఫాన్ వల్ల వ్యవసాయ భూములు, ఆక్వా దెబ్బతిందని, అధికారులతో సర్వే చేయించి ఆర్థిక సాయం అందేలా చూస్తామని కలెక్టర్ చక్రధర్బాబు అన్నారు. 80 శాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కావలి ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దారు బాలమురళీకృష్ణ, ఎంపీడీవో నాసర రెడ్డి, కావలి ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనంతరం కోవూరుపల్లి సచివాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు.
