-
-
Home » Andhra Pradesh » Nellore » missed girl died at naidupet swarnamukhi river
-
గల్లంతైన బాలిక మృతి
ABN , First Publish Date - 2020-12-16T04:33:03+05:30 IST
స్వర్ణముఖినదిలో మూడ్రోజుల క్రితం గల్లంతైన బాలిక ప్రవళిక (9) మృతిచెందింది. బాలిక మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం గుర్తించారు.

తుమ్మూరు సమీపంలో మృతదేహం లభ్యం
గుర్తించిన గెరిడివీధి యువతఫ సీఐ అభినందనలు
పోలీసుల శ్రమను మెచ్చుకున్న స్థానికులు
నాయుడుపేట/నాయుడుపేట టౌన్, డిసెంబరు 15 : స్వర్ణముఖినదిలో మూడ్రోజుల క్రితం గల్లంతైన బాలిక ప్రవళిక (9) మృతిచెందింది. బాలిక మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం గుర్తించారు. ఈ ఘటనతో స్థానికుల్లో విషాదం నెలకొంది. నాయుడుపేట - తిమ్మాజికండ్రిగ స్వర్ణముఖినది కాజ్వేపై ఈనెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా 9 ఏళ్ల ప్రవళిక నదిలో గల్లంతైన ఘటన తెలిసిందే. అప్పటి నుంచి పోలీస్, అగ్నిమాపకశాఖ అధికారులు, రిస్క్టీమ్ సిబ్బంది నదిలో అడుగడుగునా జల్లెడ పట్టి గాలించినా బాలిక ఆచూకీ లభ్యంకాలేదు. అదే రోజు నుంచి పట్టణంలోని కొన్ని యువత సంఘాలు బాలికను వెతికే పనిలో నిమగ్నమయ్యాయి. సీఐ ఆయా సంఘాలకు ఇద్దరు కానిస్టేబుళ్లను జత చేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని గెరిడివీధి యువత బృందం మంగళవారం మధ్యాహ్నం పట్టణంలోని తుమ్మూరు సమీపంలో నదిలోని దిబ్బలో ఇరుక్కుపోయి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించింది. అక్కడ నుంచి మృతదేహాన్ని గట్టుకు తెచ్చేందుకు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దాంతో ఆ బృందం నాయుడుపేట సీఐ వేణుగోపాల్రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరరావులకు సమాచారం ఇచ్చింది. వారు రోప్లను ఏర్పాటు చేయడంతో ఓజిలి మండలం జోస్యులవారికండ్రిగ స్వర్ణముఖినది వైపు ఉన్న గట్టుకు మృతదేహాన్ని యువత తీసుకువచ్చింది. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్లో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
యువతకు సీఐ అభినందనలు
బాలిక మృతదేహాన్ని మృతదేహం మున్సిపాలిటీకి అప్పగింత గుర్తించి గట్టుకు చేర్చిన యువతను, పోలీసు సిబ్బందిని సీఐ వేణుగోపాల్రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. స్థానికులు పోలీసులను యువత చొరవను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
మున్సిపాలిటీకి మృతదేహం అప్పగింత
నాయుడుపేట టౌన్ : పోలీసులు బాలిక ప్రవళిక మృతదేహాన్ని మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్రెడ్డికి అప్పగించారు. తల్లి సుజాత తన కుమార్తె మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకు వెళ్లలేనని పోలీసులకు తెలిపింది. దాంతో పోలీసులు మంగళవారం రాత్రి కమిషనర్కు అప్పగించారు. ఆయన ఆసుపత్రి వద్దకు చేరుకుని మున్సిపల్ సిబ్బంది చేత తరలించి ఖననం చేయించేందుకు ఏర్పాట్లు చేశారు.