కరోనా కన్నా ప్రమాదకారి జగన్‌

ABN , First Publish Date - 2020-03-13T10:13:55+05:30 IST

కరోనా వైరస్‌ కన్నా ప్రమాదకరమైన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్ని తెలుగుదేశం

కరోనా కన్నా ప్రమాదకారి జగన్‌

సీఎంలో క్షేత్రస్థాయికి పాకిన వైరస్‌ లక్షణాలు

ఇది బీహారా.. ఏపీనా..!?

త్వరలో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు

నుడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి నిప్పులు


నెల్లూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ కన్నా ప్రమాదకరమైన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్ని తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు, నుడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. జగన్‌ వైరస్‌ లక్షణాలు క్షేత్రస్థాయికి పాకాయాని, అందుకే వైసీపీ నాయకులు రౌడీల్లో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గురువారం నెల్లూరులోని ఎన్టీఆర్‌ భవన్‌లో కోటంరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రశాంతతకు మారుపేరు అయిన జిల్లాలో మాజీ మంత్రి పరసాపై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టడం దారుణమని ఖండించారు.


పోలీసుస్టేషన్‌ పక్కనే దాడిచేశారంటే వైసీపీ నాయకులకు భయం లేదని, వారికి ఆ భరోసాను జగన్మోహన్‌రెడ్డి ఇచ్చారని విమర్శించారు. వెంకటాచలం మండలంలో బీజేపీకి గిరిజన మహిళ  నామినేషన్‌ వేసేందుకు వెళుతుంటే కత్తితో దాడి చేశారని, ఈ పద్ధతులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మాచర్లలో వైసీపీ నాయకుడు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమాను చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఇది బీహారా.. ఆంధ్రప్రదేశ్‌నా అని శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయం కనిపించడం లేదని రాచరికం కనిపిస్తోందని మండిపడ్డారు.


రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదన్న కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. జగన్‌ కనుసన్నల్లో ఎలక్షన్‌ కమిషన్‌ నడుస్తున్నట్లుందని ఆరోపించారు. వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకొని రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకుంటే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్లు ఇవ్వమని జగన్‌, విజయసాయిరెడ్డి చెప్పడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఎంతకైనా తెగిస్తున్నారని విమర్శించారు.


రౌడీయిజాన్ని, అరాచక పాలనను అడ్డుకునేందుకు ప్రజలకు సమయం వచ్చిందని, ఓటుతో వైసీపీకు బుద్ధి చెప్పాలని కోటంరెడ్డి కోరారు. వైసీపీ అరాచకాలపై త్వరలోనే గవర్నర్‌ను కలిసి వివరిస్తామని వెల్లడించారు.  ఈ సమావేశంలో నాయకులు ధర్మవరం సుబ్బారావు, పిట్టి సత్యనాగేశ్వరరావు, మేకల రామ్మూర్తి, మహేంద్రరెడ్డి, ఆకుల హనుమంతు, మొహిద్దీన్‌, జాఫర్‌, ఖాజావళి, నాగేంద్ర, శశి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-13T10:13:55+05:30 IST