ప్రైవేట్‌ వైద్యుల బంద్‌ పాక్షికం

ABN , First Publish Date - 2020-12-12T04:11:01+05:30 IST

ప్రైవేట్‌ వైద్యులు శుక్రవారం చేపట్టిన బంద్‌ పాక్షికంగా ముగిసింది.

ప్రైవేట్‌ వైద్యుల బంద్‌ పాక్షికం
మూసివేసి ఉన్న రామచంద్రారెడ్డి ఆసుపత్రి, ప్రకటన బోర్డు

ఆయుష్‌ వైద్యులకు శస్త్రచికిత్సల అనుమతులపై నిరసన

జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల మూసివేత


నెల్లూరు(వైద్యం), డిసెంబరు 11 : ప్రైవేట్‌ వైద్యులు శుక్రవారం చేపట్టిన బంద్‌ పాక్షికంగా ముగిసింది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఆసుపత్రులు తెరిచి ఉంచి యఽథావిధిగా రోగులకు చికిత్సలు కొనసాగించాయి. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జిల్లాశాఖ ఇచ్చిన పిలుపునకు ప్రైవేట్‌ వైద్యులు పూర్తి సహకారం అందించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (సీసీఐఎం) వారు ఆయుష్‌ వైద్యులకు శస్త్రచికిత్సలు చేసుకునేలా అనుమతులు జారీ చేశారు. దీనిపై అల్లోపతి వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రోగులకు అత్యంత ప్రమాదకరమని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త బంద్‌కు ఐఎంఏ పిలుపునిచ్చింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆసుపత్రులు మూసివేసి కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేయాలని కోరింది. జిల్లా వ్యాప్తంగా ఈ బంద్‌లో ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు. జిల్లాలో 1500కుపైగా ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉండగా వాటిలో నెల్లూరులోని పొగతోటలోనే అత్యధికంగా 500కుపైగా ఉన్నాయి. వైద్యుల బంద్‌ కారణంగా ఆయా ఆసుపత్రులలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. కొందరు రోగులు ఆసుపత్రులు తెరిచే వరకు వేచి ఉన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఆసుపత్రుల్లో సేవలు పునః ప్రారంభించారు. పలువురు వైద్యులు మాత్రం బంద్‌తో సంబంధం లేకుండా వైద్య సేవలు కొనసాగించారు. దీంతో బంద్‌ పాక్షికంగా ముగిసింది. 

Updated Date - 2020-12-12T04:11:01+05:30 IST