బ్యాంకుకు బురిడీ
ABN , First Publish Date - 2020-11-14T03:35:33+05:30 IST
ఓ వ్యక్తి ఏటీఎంలో నగదు డ్రా చేసుకున్నా రానట్టు బ్యాంకు అధికారులను నమ్మించి మళ్లీ అదే మొత్తం జమ చేయించుకుని బురిడీ కొట్టించాడు.
ఏటీఎంలో రూ. 20 వేల డ్రా
రానట్లుగా నమ్మించాడు..
మళ్లీ బ్యాంకుచే జమ
నాయుడుపేట టౌన్, నవంబరు 13 : ఓ వ్యక్తి ఏటీఎంలో నగదు డ్రా చేసుకున్నా రానట్టు బ్యాంకు అధికారులను నమ్మించి మళ్లీ అదే మొత్తం జమ చేయించుకుని బురిడీ కొట్టించాడు. ఈ సంఘటన నాయుడుపేటలో ఇటీవల జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ ప్రధాన బ్యాంకు ఏటీఎంలో ఓ వ్యక్తి ఏటీఎం కార్డు ద్వారా రూ 20వేలు డ్రా చేశాడు. నగదు డ్రా అయినట్టు సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. అయితే ఆ వ్యక్తి తనకు నగదు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చిందనీ, నగదు రాలేదనీ బ్యాంకు అధికారిని నమ్మించాడు. దాంతో ఆ అధికారి అతని ఖాతాకు రూ 20వేలు జమచేశారు. వెంటనే ఆ సొమ్మునూ డ్రా చేశాడు. ఇంతలో అతను ఇచ్చిన ఫిర్యాదును బ్యాంకు అధికారులు పరిశీలించగా ఆ వ్యక్తి ఏటీఎం ద్వారా రూ 20 వేలను డ్రా చేసినట్టు నిర్ధారించారు. అతను బ్యాంకును మోసం చేసినట్లు గుర్తించారు. గతంలోనూ ఇదే తరహాలో మూడుసార్లు మోసం జరగడంతో ఆ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శుక్రవారం ఎస్ఐ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశాడు.