ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వాగులు
ABN , First Publish Date - 2020-11-28T05:02:41+05:30 IST
వరదనీటితో గూడూరు అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా వాగులు ఉగ్రరూపం దాల్చడంతో చప్టాలపై నీరు ప్రవహించి వాహనాల రాకపోకలు స్థంభించిపోయాయి.
ఎటుచూసినా వరద ప్రవాహం
స్థంభించిన రాకపోకలు
దిగ్బంధంలో గూడూరు పట్టణం
గూడూరు, నవంబరు 27: వరదనీటితో గూడూరు అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా వాగులు ఉగ్రరూపం దాల్చడంతో చప్టాలపై నీరు ప్రవహించి వాహనాల రాకపోకలు స్థంభించిపోయాయి. పట్టణంలో రోడ్లు జలమయం కావడంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరింది. చవటపాళెం, బీసీ కాలనీ, చిల్లకూరు హరిజనవాడ, పూలతోట, మధురెడ్డికాలనీ, పురిటిపాళెం ప్రాంతాలలో వరదనీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. మర్రిపల్లిమడుగు ఉధృతికి విందూరు మార్గంలో , పంబలేరు వాగు ప్రవహించడంతో పంబలేరు చప్టాపై రాకపోకలు స్థంభించాయి. బీసీ కాలనీ సమీపంలో పిల్లవాగు ప్రవహించడంతో మధురెడ్డికాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు సిబ్బందిని నియమించి ప్రజలు వాగులు దాటకుండా అడ్డుకున్నారు. పంబలేరు, చల్లకాలువ ప్రవాహ వేగం పెరగడంతో రెండు ఒకటై ప్రవహించాయి. దీంతో నిమ్మతోటలు, బొప్పాయి తోటలు నీట మునిగాయి.