4చోట్ల టపాసుల అంగళ్లు
ABN , First Publish Date - 2020-11-13T05:38:48+05:30 IST
దీపావళి పండుగ సందర్భంగా నగరంలోని నాలుగు మైదానాల్లో బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అధికారులు ఎట్టకేలకు అనుమతులు ఇచ్చారు.
లక్కీడిప్ ద్వారా షాపుల కేటాయింపు
నెల్లూరు(వెంకటేశ్వరపురం), నవంబరు12 : దీపావళి పండుగ సందర్భంగా నగరంలోని నాలుగు మైదానాల్లో బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అధికారులు ఎట్టకేలకు అనుమతులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దీపావళి రోజు రెండు గంటలపాటు బాణాసంచా(గ్రీన్క్రాకర్స్) కాల్చేందుకు అనుమతి ఇవ్వడంతో జిల్లా అధికార యంత్రాంగం సైతం షాపుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో లక్కీడిప్ తీశారు. ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆర్ఎస్ఆర్ పాఠశాల, వైఎంసీఏ, సర్వోదయ కళాశాల మైదానాల్లో, మినీ బైపాస్లోని జీపీఆర్ గ్రాండ్ కల్యాణ మండపంలో తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు అనుమతిచ్చారు. తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే బాణాసంచా కాల్చేందుకు అనుమతి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏవో మధుసూదనరావు, అర్బన్ తాహసీల్దారు మనోహర్బాబు తదితరులు పాల్గొన్నారు.