రైతులకు 9గంటల విద్యుత్‌ను పటిష్టంగా అమలు చేస్తాం

ABN , First Publish Date - 2020-12-02T04:51:35+05:30 IST

రైతాంగానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ట్రాన్స్‌కో డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

రైతులకు 9గంటల విద్యుత్‌ను పటిష్టంగా అమలు చేస్తాం
సమావేశం నిర్వహిస్తున్న ట్రాన్స్‌కో డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

నెల్లూరు(జడ్పీ); డిసెంబరు 1 : రైతాంగానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ట్రాన్స్‌కో డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. విద్యుత్‌భవన్‌లోని ఎస్‌ఈ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతాంగానికి 9గంటల విద్యుత్‌ సరఫరాకు ట్రాన్స్‌కో, డిస్కం అధికారులు సమన్వయం చేసుకుంటూ పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అవసరమైన పనులను రెండుశాఖలు కలిసి చేపడతాయని చెప్పారు. అవసరమైన పవర్‌ ట్రాన్స్‌ఫారాలు ఏర్పాటు చేసి కెపాసిటీని పెంచుతామన్నారు. అలాగే సబ్‌స్టేషన్లలో పరికరాలు పెంచడం, 132 కేవీ లైన్ల సామర్థ్యాన్ని పెంచుతున్నామని వివరించారు.  అనంతసాగరంలో 132కేవీ  సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని త్వరతిగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు తూర్పు,  పడమర, మాంబట్టు,  పొదలకూరు, పోర్టురోడ్డు, బుచ్చి, సంగంలలోనూ 132కేవీ  సబ్‌స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో విద్యుత్‌ శాఖ  ఎస్‌ఈ విజయ్‌కుమార్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ  శ్రీనివాస్‌, ఎడ్యుకేటివ్‌ ఇంజనీర్లు రమణదేవి, శ్రీహరిరావు, రాఘవేంద్ర, జగదీష్‌, జయకృష్ణారెడ్డి, జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T04:51:35+05:30 IST