కరోనా మృతి సమాచారం ఆలస్యం
ABN , First Publish Date - 2020-09-06T08:00:00+05:30 IST
కరోనాతో మృతి చెందిన వ్యక్తి(70) సమాచారాన్ని నాలుగు రోజుల తర్వాత తెలపడంపై మృతుడి కుటుంబ సభ్యులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు...
![కరోనా మృతి సమాచారం ఆలస్యం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కుటుంబసభ్యుల ఆగ్రహం
అంత్యక్రియలకు రూ.15 వేల వసూలు
ఆసుపత్రి తీరుపై విచారణ జరపాలి: లోక్సత్తా
నెల్లూరు (వైద్యం)సెప్టెంబరు 5 : కరోనాతో మృతి చెందిన వ్యక్తి(70) సమాచారాన్ని నాలుగు రోజుల తర్వాత తెలపడంపై మృతుడి కుటుంబ సభ్యులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల కథనం మేరకు కావలికి చెందిన రెడ్క్రాస్ జీవిత కాలపు సభ్యుడు ఏన్డీసీసీ రిటైర్డ్ ఏజీఎం సూరయ్యకు కరోనా రావడంతో గత నెల 26న జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడి కుమార్తె పద్మావతి, మనవడు నశికేత్ గత నెల 30న ఆసుపత్రికి వచ్చి విచారించగా సూరయ్య ఆరోగ్యం భాగానే ఉందని వైద్యులు చెప్పారు. సమాచారం కోసం ఆమె తన ఫోన్ నెంబర్ వారికిచ్చింది. బాధితుడు 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు మృతి చెందారు. ఆ సమాచారం కుటుంబ సభ్యులకు తెలపకుండా అధికారులు మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచారు. ఈనెల 4వ తేదీన కుటుంబ సభ్యులకు మరణవార్త గురించి తెలపడంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తీరా మృతదేహం అంత్యక్రియల కోసం రూ.15వేలు ఇవ్వాలని అక్కడి వారు డిమాండ్ చేయడంతో శనివారం ఆ మొత్తం చెల్లించారు. ఈ సందర్భంగా లోక్సత్తా జిల్లా అధ్యక్షుడు అంకయ్య చౌదరి మాట్లాడుతూ జిల్లా కొవిడ్ ఆసుపత్రి చర్యలపై విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.