తీవ్ర‘మే’!
ABN , First Publish Date - 2020-05-24T09:21:35+05:30 IST
మహమ్మారి కరోనా తగ్గినట్టే తగ్గి ఈ నెలలో తన విశ్వరూపం చూపుతోంది. గడిచిన 23 రోజుల్లో 132 పాజిటివ్ కేసులు ..

ఈ నెలలో అనూహ్యంగా పెరుగుతున్న కేసులు
ఇప్పటిదాకా 132 పాజిటివ్ల నమోదు
ఢిల్లీ, కోయంబేడు ప్రభావమే ఎక్కువ
వణికిపోతున్న సూళ్లూరుపేట వాసులు
నెల్లూరు (వైద్యం) మే 23 : మహమ్మారి కరోనా తగ్గినట్టే తగ్గి ఈ నెలలో తన విశ్వరూపం చూపుతోంది. గడిచిన 23 రోజుల్లో 132 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, కోయంబేడు ప్రభావంతోనే బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. మార్చి 9వ తేదీన ఒక కరోనా పాజిటివ్ కేసుతో ప్రారంభమైన వైరస్ కొంతవరకు పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్ మాసాంతానికి కేవలం 84 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అప్పటికి సూళ్లూరుపేటలో ఒక్క కేసు కూడా లేదు. అయితే చెన్నైలోని కోయంబేడు మార్కెట్ ప్రభావం అమాంతం కరోనా పాజిటివ్ లెక్కలనే మార్చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే సూళ్లూరుపేటను అతలాకుతలం చేసేసింది. ప్రస్తుతం ఆ ప్రభావం కొనసాగుతూనే ఉండగా ఇప్పటికి 75 కేసులు నమోదయ్యాయి. కరోనా నియంత్రణకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం దక్కడం లేదు.
మరో 8 పాజిటివ్ కేసులు
జిల్లాలో శనివారం మరో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూళ్లూరుపేటలో 6, కావలి, గూడూరులలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 217కు చేరుకుంది.