ఊటుకూరులో ఆక్వా పరికరాల చోరీ
ABN , First Publish Date - 2020-12-02T03:38:22+05:30 IST
మండంలోని ఊటుకూరులో రూ.60లక్షల విలువ చేసే ఆక్వా పరికరాలు చోరీకి గురైనట్లు మంగళవారం రైతులు తెలిపారు.

విడవలూరు, డిసెంబరు 1: మండంలోని ఊటుకూరులో రూ.60లక్షల విలువ చేసే ఆక్వా పరికరాలు చోరీకి గురైనట్లు మంగళవారం రైతులు తెలిపారు. ఊటుకూరు పల్లిపాళెం సమీపంలో ఉన్న సుమారు 120 ఎకరాల్లో ఉన్న రేడియేటర్లు, మోటార్లు, రొయ్యల మేత బస్తాలు, డీజిల్ క్యాన్లు దోపిడీకి గురయ్యాయి. ఈ వ్యవహారంలో స్థానిక మత్స్యకారుల పాత్రపై అనుమానాలు ఉన్నట్లు రైతులు పేర్కొన్నారు. బాధితుల కథనం మేరకు, ఊటుకూరు పల్లిపాళెం సమీపంలో సుమారు 2000 వేల ఎకరాల్లో అక్వాసాగు చేపట్టారు. తుఫాన్ నేపథ్యంలో కొందరు రైతులు తమ పొలాల్లోని రేడియేటర్లు వరదలకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టారు. విద్యుత్ మోటార్లును, మేత బస్తాలను, డీజిల్ క్యాన్లను పొలాల్లోని షెడ్లలో దాచిపెట్టారు. వర్షాలకు పెన్నానది పొంగి పల్లిపాళెం పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో సుమారు 170 ఎకరాలు నీట మునగలేదు. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు బోట్ల సాయంతో వరద ముంపునకు గురికాని రొయ్యల గుంతలు వద్దనున్న పరికరాలు తీసుకుని వెళ్లారు. రేడియేటర్లకు కట్టి ఉన్న తాళ్లను నరికి వాటిని బోట్లతో లాక్కెళ్లారు. అలాగే షెడ్లలో ఉన్న విద్యుత్ మోటార్లు, రొయ్యల మేత, డీజిల్ క్యాన్లను తీసుకునిపోయారు. సుమారు రూ. 60లక్షలు విలువ చేసే పరికరాలు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు.