ఏడాదిన్నరకే.. నూరేళ్లు

ABN , First Publish Date - 2020-12-07T04:23:57+05:30 IST

తమ ఏడాదిన్నర కొడుకును తీసుకుని మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. నాన్నమ్మ వాళ్ల ఊరికి పోతున్నామంటూ ఆ తల్లిదండ్రులు బిడ్డకు కబుర్లు చెబుతూ సంతోషంగా పోతున్నారు. అంతలోనే ఓ కారు వేగంగా వచ్చి మోటారు సైకిల్‌ను ఢీకొనడంతో ఘోరం జరిగిపోయింది. ఆ బిడ్డ ఎగిరి కింద పడి మృత్యువాతపడ్డాడు. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద సంఘటన అన్నమేడు క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది.

ఏడాదిన్నరకే.. నూరేళ్లు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి సాత్విక్‌

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు 

మోటారు సైకిల్‌ను ఢీకొన్న కారు

 జాతీయ రహదారిపై ఘటన

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 6 : తమ ఏడాదిన్నర కొడుకును తీసుకుని మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. నాన్నమ్మ వాళ్ల ఊరికి పోతున్నామంటూ ఆ తల్లిదండ్రులు బిడ్డకు కబుర్లు చెబుతూ సంతోషంగా పోతున్నారు. అంతలోనే ఓ కారు వేగంగా వచ్చి మోటారు సైకిల్‌ను ఢీకొనడంతో ఘోరం జరిగిపోయింది.  ఆ బిడ్డ ఎగిరి కింద పడి మృత్యువాతపడ్డాడు. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ విషాద సంఘటన అన్నమేడు క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన వెంబేటి అశోక్‌కు నాయుడుపేట పట్టణానికి చెందిన ప్రసన్నకు మూడేళ్ల క్రితం వివాహమైంది. ఉద్యోగరీత్యా అశోక్‌ నాయుడుపేటలో నివాసం ఉంటున్నాడు. వారికి ఒకటిన్నర సంవత్సరం కుమారుడు సాత్విక్‌ ఉన్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఆ దంపతులు తమ కుమారుడితో కలిసి మోటారు సైకిల్‌పై బాలిరెడ్డిపాళేనికి బయలుదేరారు. మార్గమధ్యంలో అన్నమేడు క్రాస్‌రోడ్డు వద్ద  జాతీయ రహదారిపై నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్లే కారు మోటారు సైకిల్‌ను ఢీకొంది. దాంతో చిన్నారి ఎగిరి కిందపడిపోయాడు. తల్లిదండ్రులూ కిందపడి  తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో కారులో వెళ్తున్న ఓ రవాణాశాఖ అధికారి ఆ చిన్నారిని తన కారులో ఎక్కించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే  చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర గాయాలపాలైన తల్లిదండ్రులను 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆసుపత్రిలో తన బిడ్డ ఇంకా బతికే ఉన్నాడనుకున్న ఆ తల్లి ‘నాన్నవాళ్ల ఊరు వచ్చేసింది.. అన్నంపెడతా లేరా నాన్నా అంటూ హృదయవిదారకంగా విలపించడం చూపురులను కంటతడి పెట్టించింది. అనంతరం ఆ దంపతులను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. సాత్విక్‌ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2020-12-07T04:23:57+05:30 IST