ఓసీ స్థానంలో బీసీ గెలవాలి.. !
ABN , First Publish Date - 2020-03-08T09:53:29+05:30 IST
ఎంపీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్లతో బుచ్చి ఎంపీపీ ఎంపికకు పెద్ద చిక్కు

అప్పుడే బుచ్చి ఎంపీపీ సీటు దక్కేది..
బుచ్చిరెడ్డిపాళెం,మార్చి 7 : ఎంపీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్లతో బుచ్చి ఎంపీపీ ఎంపికకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎంపీపీ స్థానం బీసీ జనరల్కు కేటాయించగా, ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించలేదు. దీంతో పోటీ చేసే నేతలు డోలాయమానంలో పడ్డారు. బీసీలు కచ్చితంగా ఏదో ఒక ఓసీ కేటగిరి స్థానంలో పోటీ చేసి గెలిస్తేనే ఎంపీపీ పదవి దక్కుతుంది. ఓసీ స్థానాల్లో ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా పోటీ చేయవచ్చు. ప్రస్తుతం అధికారపార్టీ తప్ప ఇతర పార్టీలకు చెందిన వారెవరు గెలిచినా అంత ప్రయోజనం వుండదన్న ఆలోచనకుతోడు.. వ్యయ, ప్రయాసలకు సాహసం చేయలేరనేది పలువురి అభిప్రాయం. ఈ విషయమై పలు పార్టీల నాయకులు మండల పరిషత్ అధికారులను సంప్రదించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తప్ప తామేమి చెప్పలేమం టూ వారు తేల్చారు.
తప్పు ఎలా జరిగింది..?
ఎంపీపీ స్థానాన్ని బీసీలకు రిజర్వ్ చేసి, ఎంపీటీసీ స్థానాల్లో ఒక్క స్థానం కూడా వారికి కల్పించకపోవడంపై అన్ని పార్టీలు నేతలు తప్పు పడుతున్నారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. నాయకుల విమర్శలకు వివరణ ఇవ్వలేక అధికారులు తల పట్టుకుంటున్నారు.