సతాయిస్తున్న సర్వర్!
ABN , First Publish Date - 2020-10-21T05:35:41+05:30 IST
చౌక దుకాణాల్లో సర్వర్ మొరాయిస్తుండటంతో లబ్ధిదారులకు తిప్పలు తప్పడంలేదు. సోమవారం నుంచి ప్రభుత్వం 14వ విడత బియ్యం, శనగలు లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది.

లబ్ధిదారులకు తప్పని తిప్పలు
రెండు వేలిముద్రలతో మరీ ఆలస్యం
తలలు పట్టుకుంటున్న డీలర్లు
ఉదయగిరి రూరల్, అక్టోబరు 20 : చౌక దుకాణాల్లో సర్వర్ మొరాయిస్తుండటంతో లబ్ధిదారులకు తిప్పలు తప్పడంలేదు. సోమవారం నుంచి ప్రభుత్వం 14వ విడత బియ్యం, శనగలు లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. లబ్ధిదారులు ఈ-పాస్ యంత్రంలో వేలిముద్ర వేసి ఈ సరుకులు తీసుకోవాలి. కానీ మెట్ట ప్రాంతంలో సర్వర్ సమస్య వారి పాలిట శాపంగా మారింది. గంటల తరబడి వేచి ఉన్నా సర్వర్ రాకపోవడంతో లబ్ధిదారులు సరుకులు తీసుకోకుండా వెనుతిరుగుతున్నారు. మరోవైపు ప్రభుత్వం 14వ విడత నుంచి 6.7 వెర్షన్కు అప్డేట్ చేసి బియ్యానికి ఒక వేలిముద్ర, నిత్యావసర సరుకులకు మరో వేలిముద్ర వేయాలని సూచించింది. దీంతో అటు డీలర్లు, ఇటు లబ్ధిదారులకు అవస్థలు పడుతున్నారు. కరోనా సమయంలో తొలుత లబ్ధిదారుల వేలిముద్ర లేకుండానే ప్రభుత్వం సరుకులు పంపిణీ చేసింది. అనంతరం చౌక దుకాణంలో కొవిడ్ నిబంధనలు పాటించడంతోపాటు శానిటైజర్లు ఏర్పాటు చేసి వేలిముద్రల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని సూచించింది. ప్రస్తుతం రెండు వేలిముద్రలు వేయాలని సూచించడంతో లబ్ధిదారులు, డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.