భూకుంభకోణంపై ఏసీబీ విచారణ
ABN , First Publish Date - 2020-06-01T10:16:40+05:30 IST
కలువాయి మండలంలో జరిగిన భూకుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దృష్టి
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
కలువాయి, మే 31 : కలువాయి మండలంలో జరిగిన భూకుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దృష్టి సారించారు. ఈ ఘటనలో తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్తో పాటు ముగ్గురు వీఆర్వోలను ఆదివారం నెల్లూరుకు పిలిపించి విచారించినట్లు తెలిసింది.
మండలంలో అసైన్మెంటు కమిటీ ఆమోదం లేకుండా వెబ్ల్యాండ్లోని అడంగల్, 1బీలో పేర్లు నమోదు చేసి వందలాది ఏకరాల ప్రభుత్వ భూములు పంచిపెట్టారని, మేత పోరంబోకు, కాలువ పోరంబోకు భూములను ప్రభుత్వ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా పట్టాలిచ్చారని కొందరు ఇటీవలి జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. చవటపల్లి రిజర్వాయర్ కింద భూములు ముంపునకు గురైన రైతులకు జినైన్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో కూడా అవకతకలు జరిగినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 20వతేదీ మండలంలో జరిగిన భూకుంభకోణాన్ని ఆంద్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది.
దీనిపై విచారణ జరిపి ఇటీవల కలువాయి తహసీల్దారు మానికల ప్రమీలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అలాగే ఈ భూకుంభకోణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులకు కూడా కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ అంశమై ఏసీబీ డీఎస్పీ దేవానంద్శాంతోను ఆంధ్రజ్యోతి సంప్రదించగా విచారణ జరుపుతున్నది వాస్తవమేనని ధ్రువీకరించారు.