పోలీసులు తరమడంతో కింద పడి యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-03-27T10:22:29+05:30 IST
రోడ్లపై ఉన్న వారిని తరిమికొట్టడంలో ఓ యువకుడు కిందపడి ప్రాణాలొదిలాడు. గ్రామస్థుల కథనం మేరకు..ఆదోని మండలం పెద్దహరివాణానికి చెందిన సిద్ధయ్యస్వామి, గౌరమ్మ దంపతులకు ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు సంతానం.
పెద్దహరివాణంలో ఘటన
ఆదోని రూరల్, మార్చి 26: రోడ్లపై ఉన్న వారిని తరిమికొట్టడంలో ఓ యువకుడు కిందపడి ప్రాణాలొదిలాడు. గ్రామస్థుల కథనం మేరకు..ఆదోని మండలం పెద్దహరివాణానికి చెందిన సిద్ధయ్యస్వామి, గౌరమ్మ దంపతులకు ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు సంతానం. వీరిలో వీరభద్రయ్యస్వామి (20) బెంగళూరులో గౌండా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా ప్రభావంతో పనులు ఆగిపోవడంతో రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి పెద్దహరివాణానికి వచ్చాడు.
గురువారం రాత్రి గ్రామ శివారులో గ్రామస్థులతో కలిసి వీరభద్రయ్యస్వామి రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో పోలీసులు వారి వెంటపడి తరిమారు. వీరభద్రయ్యస్వామి ప్రమాదవశాత్తు కిందపడి రోడ్డుపై ఉన్న రాయికి తల కొట్టుకోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలిసి గ్రామస్థులంతా ఘటనా స్థలానికి చేరుకొని పోలీసుల అత్యుత్సాహంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ డీఎస్పీ రామకృష్ణను వివరణ కోరగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి వాళ్లే పరిగెత్తారని చెప్పారు.