భక్తిశ్రద్ధలతో షేక్షావలి, షాషావలి ఉరుసు
ABN , First Publish Date - 2020-11-14T04:06:38+05:30 IST
ఎల్లార్తి షేక్షావలి, షాషావలి సాహెబ్ల ఉరుసు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
హొళగుంద, నవంబరు 13: ఎల్లార్తి షేక్షావలి, షాషావలి సాహెబ్ల ఉరుసు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాజీ ముజావర్ అబ్దుల్రవూఫ్ ఇంటి నుంచి తెల్లవారుజామున గంధాన్ని దర్గా పీఠాధిపతి సయ్యద్మోయినుద్దీన్ అహ్మద్ ఖాద్రీ తలపై పెట్టుకొని గ్రామంలోని వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. దర్గాకు చేరిన గంధాన్ని షేక్షావలి, షాషావలి సాహెబ్ల సమాధులపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వామి వారి గంధాన్ని తీసుకోడానికి భక్తులు పోటీ పడ్డారు. కొవిడ్ నిబంధనలు అమలులో ఉండడంతో దర్గాకు భక్తుల రద్దీ తగ్గింది. ఈ ఏడాది భక్తులు బాగా తగ్గారని పీఠాధిపతి తెలిపారు. ఆదోని డీస్పీ వినోద్కుమార్, ఆలూరు సీఐ భాస్కర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. హొళగుంద, ఆలూరు, ఆస్పరి ఎస్ఐలు విజయ్కుమార్, శ్రీనివాసులు, గిరిబాబు బందోబస్తును ఏర్పాటు చేశారు.