నేటి నుంచి తరగతులు
ABN , First Publish Date - 2020-12-14T05:17:46+05:30 IST
అన్ని యజమాన్యాల పాఠశా లల్లో 2020-2021 విద్యాసంవత్సరానికి సంబంధించి 7వ తరగతులు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నట్లు డీఈవో సాయిరాం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 13: అన్ని యజమాన్యాల పాఠశా లల్లో 2020-2021 విద్యాసంవత్సరానికి సంబంధించి 7వ తరగతులు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నట్లు డీఈవో సాయిరాం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తరగతి విద్యార్థులు సోమ, బుధ, శుక్రవారాలలో, 8వ తరగతి విద్యార్థులు మంగళ, గురు, శనివారాలలో పాఠశాలలకు హాజరు కావాలన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరవ్వాలని డీఈవో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాలలో తరగతుల నిర్వహణకు తగినన్ని గదులు సదుపాయం ఉండి.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలో 7, 8, 9, 10 తరగతులను ప్రతి రోజూ నిర్వహించవచ్చునన్నారు. కొవిడ్-19 నియంత్రణకు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పక అమలు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించేటట్లు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 6వ తరగతి విద్యార్థులకు పాఠశాల పునఃప్రారంభంపై తర్వాత తెలియజేస్తామని డీఈవో తెలిపారు.