6న సైంటిఫిక్ అసిస్టెంట్ రాత పరీక్ష
ABN , First Publish Date - 2020-12-03T05:49:34+05:30 IST
హోంశాఖ పరిధిలోని స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎస్ఎల్పీఆర్బీ) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు ఈ నెల 6న రాత పరీక్ష నిర్వహిస్తోంది.
- కర్నూలులో రెండు కేంద్రాలు
- ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ, ఎస్పీ
కర్నూలు, డిసెంబరు 2: హోంశాఖ పరిధిలోని స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎస్ఎల్పీఆర్బీ) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు ఈ నెల 6న రాత పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు నంద్యాల రోడ్డులోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, నందికొట్కూరు రోడ్డులోని పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ ఫక్కీరప్ప బుధవారం పరిశీలించారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహిం చాలని ప్రిన్సిపాళ్లు, పోలీసు అధికారులకు సూచించారు. అభ్యర్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అభ్యర్థికి కొవిడ్ స్ర్కీనింగ్ చేసిన తర్వాతే అనుమతించాలని కోరారు. ప్రతి కేంద్రానికి పోలీస్శాఖ తరపున నోడల్ అధికారిని నియ మించామన్నారు. కర్నూలుతో పాటు విశాఖ, గుంటూరు, కాకినాడ, తిరుపతిలో కూడా పరీక్ష కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ రెండు కేంద్రాల్లో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారన్నారు. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 748 మంది, పుల్లయ్య కాలేజీలో 738 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. పుల్లారెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, పుల్లయ్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, కరస్పాండెంట్ మోహన్, డీఎస్పీలు వెంకటాద్రి, యుగంధర్బాబు, కేవీ మహేష్, రామాంజి నాయక్, సీఐలు ఓబులేసు, శ్రీనాథ్ రెడ్డి, ఈకాప్స్ ఇన్చార్జి రాఘవరెడ్డి పాల్గొన్నారు.
అభ్యర్థులకు సూచనలు
హాల్టికెట్తో గంట ముందే పరీక్ష కేంద్రానికి రావాలి.
పరీక్ష ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది.
ఫేస్ మాస్కులు, శానిటైజర్ కలిగి ఉండాలి.
కేంద్రంలోకి పెన్నులు, సెల్ఫోన్, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలకు అనుమతి లేదు. పెన్నులు పరీక్ష కేంద్రంలోనే ఇస్తారు.
అభ్యర్థులకు బయోమెట్రిక్, ఫొటో క్యాప్చరింగ్ సేకరణ ఉంటుంది.