‘ఆర్‌ఏఆర్‌ఎస్‌ను కాపాడుకుంటాం’

ABN , First Publish Date - 2020-12-30T05:19:36+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని కాపాడుకుంటామని, దీని కోసం చివరంటా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.

‘ఆర్‌ఏఆర్‌ఎస్‌ను కాపాడుకుంటాం’
ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు

నంద్యాల, డిసెంబరు 29: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని కాపాడుకుంటామని, దీని కోసం చివరంటా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఎదుట వ్యవసాయ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ గత 45 రోజులుగా అనేక రూపాల్లో పోరాటం చేస్తున్నా కలెక్టర్‌ మొదలుకొని నంద్యాల స్థానిక ప్రజాప్రతినిధులెవ్వరూ స్పందించడం లేదని అన్నారు. కొత్తగా అభివృద్ధి చేయడమంటే ఉన్న వాటిని నాశనం చేయడం కాదని అన్నారు. వైద్య కళాశాలకు భూమి కొనాల్సి ఉంటే ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి నిధుల కోసం కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. పరిశోధనా భూమిలో వైద్య కళాశాలను నిర్మించాలనే నిర్ణయం వెనుక ఎంపీ, ఎమ్మెల్యే స్వార్థ పూరిత రాజకీయాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మిక సంఘం నాయకులు రమణ, ఖాదర్‌వలి, ఎల్లమ్మ, నాగేశ్వరమ్మ, కుమారి, మైమున్నీసా, రామకృష్ణతో పాటు భారీగా కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:19:36+05:30 IST