-
-
Home » Andhra Pradesh » Kurnool » sand maphia in pathikonda
-
పత్తికొండలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
ABN , First Publish Date - 2020-12-28T05:32:38+05:30 IST
ఇసుక కనిపిస్తే చాలు.. మాఫియా చెలరేగిపోతోంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా, అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా హంద్రీలో అడ్డంగా తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.

- హైకోర్టు స్టే ఉన్నా తవ్వకాలు
- కన్నెత్తి చూడని అధికారులు
పత్తికొండ రూరల్, డిసెంబరు 27: ఇసుక కనిపిస్తే చాలు.. మాఫియా చెలరేగిపోతోంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా, అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా హంద్రీలో అడ్డంగా తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. పత్తికొండ మండలం కనకదిన్నె సమీపంలో ఈ దందా సాగుతోంది. ఈ ప్రాంతంలో నాణ్యమైన ఇసుక దొరుకుతుంది. కానీ ఇసుక తవ్వకా లకు అనుమతి లేదు. భూగర్భ జలాలు ఇంకిపోతుండటంతో దేవనకొండ, పత్తికొండ మండలాల రైతులు ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. బోర్లు ఇంకిపోతున్నాయని, వరద సమయంలో గట్లు తెగి పొలాల్లో నీరు చేరుతోందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో హంద్రీలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. అధికారులకు నోటీసులు జారీ చేసింది. రెవెన్యూ అధికారులు పది రోజుల క్రితం కోతిరాళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో చాటింపు వేయిం చారు. ముఖ్య కూడలిలో నోటీసులను అతికించారు. హంద్రీలో ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కానీ అధికారుల ఆదేశాలను ట్రాక్టర్ల యజమానులు ఖాతరు చేయడం లేదు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
హంద్రీ నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన రెవెన్యూ, పోలీసులు అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాకు అధికార పార్టీ నాయకుల అండ ఉందని, అందుకే అడ్డుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.