నివర్ పరిహారం అందిస్తాం
ABN , First Publish Date - 2020-12-03T05:30:00+05:30 IST
జిల్లాలో ఇటీవల నివర్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టానికి గురైన ప్రతి రైతుకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీని అందించనున్నదని, ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వ రమ్మ తెలిపారు.

- నష్టపోయిన ప్రతి రైతుకు సాయం
- జేడీఏ ఉమామహేశ్వరమ్మ
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 3: జిల్లాలో ఇటీవల నివర్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టానికి గురైన ప్రతి రైతుకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీని అందించనున్నదని, ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వ రమ్మ తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డిసెంబరు 10వ తేదీ లోపు అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతుల వివరాలను సామాజిక తనిఖీ కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద నోటీసు బోర్డులో ప్రచురిస్తామని తెలిపారు. వరిధాన్యం సేకరణకు నిర్దేశించిన ఎఫ్ఏక్యూ నిబంధనలను సడలించి రైతులకు ప్రయోజనం కలిగేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. అందువల్ల తుఫాన్కు వరి కొంత మేర దెబ్బతిన్నా కొనుగోలు కేంద్రాల వద్ద సడలించిన నిబంధనల మేరకు రైతుల నుంచి కొంటామని తెలిపారు. రైతుభరోసా కేంద్రాలను ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా తెరిచి ఉంచి గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు రైతులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతుభరోసా కేంద్రాల్లో వివిధ విభాగాల అధికారులు అందుబాటులో ఉండి ఈక్రాఫ్ నమోదు చేసుకోని రైతుల పొలాలకు నమోదు చేస్తారని తెలిపారు. పంటకోత యంత్రాలను అవసరమైన ప్రాంతాలకు పంపేలా ఏర్పాట్లు చేయాలని, పంట కోత రుసుమును అన్ని ప్రాంతాలకు ఒకేలా ఉండేలా పర్యవేక్షించాలని వ్యవసాయాధికారులను ఆదేశించినట్లు తెలిపారు.