నీట్‌ పరీక్ష ప్రశాంతం

ABN , First Publish Date - 2020-09-14T10:03:37+05:30 IST

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది.

నీట్‌ పరీక్ష ప్రశాంతం

నీట్‌కు 93.7 శాతం హాజరు

వర్షపు జల్లులతో ఇబ్బందులు


కర్నూలు(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 13: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కొవిడ్‌ నేపథ్యంలో గదికి 12 మందిని మాత్రమే కేటాయించారు. థర్మల్‌ స్కీనింగ్‌ టెస్టు నిర్వహించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. చిరుజల్లులు పడుతుండటంతో అభ్యర్థులు, వెంట వచ్చినవారు అసౌకర్యానికి గురయ్యారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినవారు సౌకర్యాలు లేక ఇబ్బంది పడ్డారు. జిల్లాలో మొత్తం అభ్యర్థులు 9,774 మందికి గానూ 9,162 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అయ్యారు. 612 మంది గైర్హాజరయ్యారు. 93.7 శాతం హాజరు నమోదైంది. 


కర్నూలు నగరంతో పాటు, నంద్యాల, ఎమ్మిగనూరు, బనగానపల్లె పట్టణాల్లో మొత్తం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కొనసాగింది. ఉదయం 11 గంటల నుంచే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు వచ్చారు. శానిటైజర్‌తో పాటు గ్లౌజ్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలు ఆలస్యం కావడంతో అసౌకర్యానికి గురయ్యారు. కర్నూలులో నగర శివారు ప్రాంతాలలో కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ అధికారులు సకాలంలో బస్సు సర్వీసులను నడపలేకపోయారు. జిల్లా నీట్‌ పరీక్షల కో ఆర్డినేటర్‌ రఘురామయ్య ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. 


నంద్యాల (ఎడ్యుకేషన్‌): నంద్యాల ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి వర్షం కురిసింది. పలువురు అభ్యర్థులకు కార్లలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 11.30 గంటల నుంచి తనిఖీ చేసి అనుమతించారు. నంద్యాలలో మూడు ఏంద్రాల్లో 1260 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 


బనగానపల్ల్లె: పట్టణంలోని నెహ్రూ సీబీఎస్‌ఈ హైస్కూల్లో నీట్‌ పరీక్ష నిర్వహించారు. మొత్తం 170 మంది విద్యార్థులకు 15 గదులను ఏర్పాటు చేశారు. 131 మంది పరీక్ష రాశారు. 39 మంది గైర్హాజరయ్యారు. అనంతపురం, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, కర్నూలు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు హాజరయ్యారు. 


నాగర్‌ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండ లానికి చెందిన స్వప్న, కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన విశాలాక్షి పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అనుమతించ లేదు. 


ఎమ్మిగనూరు రూరల్‌: మండలంలోని ఎర్రకోట సెయింట్‌ జాన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో  333 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 27 మంది గైర్హాజరయ్యారుయ్యారని కళాశాల ప్రిన్సిపాల్‌ ఈరన్న తెలిపారు. 

Updated Date - 2020-09-14T10:03:37+05:30 IST