భక్తులకు కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరి

ABN , First Publish Date - 2020-11-22T05:26:50+05:30 IST

పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులకు తప్పనిసరి కొవిడ్‌ స్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ మెడికల్‌ ఆఫీసర్లను ఆదేశించారు.

భక్తులకు కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరి
మెడికల్‌ క్యాంప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

  1.  వైద్య సిబ్బందిని ఆదేశించిన కలెక్టర్‌ 

కర్నూలు(హాస్పిటల్‌), నవంబరు 21: పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులకు తప్పనిసరి కొవిడ్‌ స్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ మెడికల్‌ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం మధ్యా హ్నం నగర సమీపంలో ఉన్న పంప్‌హౌస్‌ పుష్కర ఘాట్‌ను ఎస్పీ డా.ఫక్కీరప్ప, కర్నూలు నగర మున్సిపల్‌ కమిషనర్‌ డీకే బాలాజి, ఘాట్‌ ఇన్‌చార్జి డా.రమణయ్య, అనురాధతో కలిసి కలెక్టర్‌ సందర్శించారు. భక్తులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌ పుష్కర ఘాట్‌ వద్ద ఉన్న మెష్‌ బార్‌కేడింగ్‌ను కొంచెం నీరు ఆవల ఏర్పాటు చేయాలని ఇరిగేషన్‌ అధికారులను పశుసంవర్థశాఖ జేడీ రమణయ్యను ఆదేశించారు. పుష్కర ఘాట్‌కు వచ్చే భక్తులకు కొవిడ్‌ నిర్దారణ పరీక్షలతో పాటు థర్మల్‌ స్కాన్‌, పల్స్‌ ఆక్సీమీటర్‌ టెస్టులు చేయాలని మెడికల్‌ ఆఫీసర్‌ డా.శ్రీనివాసులును ఆదేశించారు. మెడికల్‌ క్యాంప్‌లో ఉన్న మందులను కొవిడ్‌ టెస్టు కిట్లను కలెక్టర్‌ పరిశీలించారు. పిండ ప్రధానాల వద్ద తప్పనిసరిగా మాస్కు ధరించి సురక్షిత ఆరు అడుగుల దూరంలో కూర్చుని పిండ ప్రధానాలు చేయాలని అర్చకులకు సూచించారు. 


 అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

 స్థానిక పంప్‌హౌస్‌ పుష్కర ఘాట్‌లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప, మున్సిపల్‌ కమిషనర్‌ డీకే బాలాజీ ప్రారంభించారు. ఈకార్యక్రమం నగర బ్రాహ్మణ సంఘం, హిందూ వాయు సేవాదళ్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కళ్లే చంద్రశేఖర్‌ శర్మ, సేవాదళ్‌ ఉపాధ్యక్షుడు, ఫుడ్‌బ్యాంక్‌ అధినేత రావి చంద్రశేఖర్‌, ఎం. మణీంద్రబాబు, ఎం. నాగరాజు, టీజీ నాగరాజు, ఆనంద్‌గౌడ్‌, ఎస్‌ గోవిందుడు సేవాదళ్‌ సభ్యులు పాల్గొన్నారు.


 రాఘవేంద్ర మఠం ఘాట్‌లో..

నగర శివారులోని రాఘవేంద్ర మఠం ఘాట్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి లక్ష్మీనారాయణ అన్నదానం చేశారు. తన తండ్రి, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి బి.పెద్ద పుల్లయ్య పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అల్పాహారం, 11 గంటల నుంచి అన్నదానం చేశారు.

Updated Date - 2020-11-22T05:26:50+05:30 IST