త్వరలో దర్శనం

ABN , First Publish Date - 2020-06-04T10:15:47+05:30 IST

భక్తులకు మహానందీశ్వరుడి దర్శన భాగ్యం త్వరలోనే కలిగే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి ఆలయాలను తెరిచేందుకు కేంద్రం ..

త్వరలో దర్శనం

మహానందిలో ఏర్పాట్లు పూర్తి

6న స్థానికులతో ట్రయల్‌ రన్‌..?


మహానంది  జూన్‌ 3: భక్తులకు మహానందీశ్వరుడి దర్శన భాగ్యం త్వరలోనే కలిగే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి ఆలయాలను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. ఈ నేపథ్యంలో క్షేత్రంలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా రంగులతో వృత్తాలను గీయించారు. ప్రధాన ద్వారం వద్ద డిజిన్ఫెక్షన్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. భక్తులు ఇక్కడికి రాగానే ఆటోమెటిక్‌ శానిటైజేషన్‌ (స్ర్పే) జరుగుతుంది. అనంతరం ముందుకు కదిలి దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. క్షేత్రానికి వచ్చే భక్తులందరూ విధిగా మాస్కులు ధరించాలని, లేదంటే దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. ఈ నెల 6 నుంచి రెండు రోజుల పాటు స్థానికులతో దర్శనం ట్రయిల్‌ రన్‌ నిర్వహించాలని, లోటుపాట్లను గుర్తించి సరిచేశాక భక్తులను అనుమతించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల ఈవోలతో దేవదాయశాఖ కమిషనర్‌ ఆర్జునరావు, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఐవీ సుబ్బారావు బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రభుత్వం దర్శనాలకు అనుమతించిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. మహానందిలో ఏర్పాట్ల గురించి ఆలయ అధికారులు వారికి వివరించారు. 


Updated Date - 2020-06-04T10:15:47+05:30 IST