లాక్డౌన్ పాక్షికం
ABN , First Publish Date - 2020-03-24T11:10:38+05:30 IST
నియోజకవర్గంలో కరోనా వ్యాధి నివారణకు చేపట్టిన లాక్డౌన్ పాక్షికంగా జరిగింది. పట్టణంలోని దుకాణాలు, సంతమార్కెట్, హోటళ్లు సోమవారం ఉదయం 12గంటల వరకు యథావిధిగా నడిచాయి.
యథావిధిగా కొనసాగిన వ్యాపారాలు
ఆళ్లగడ్డ, మార్చి 23: నియోజకవర్గంలో కరోనా వ్యాధి నివారణకు చేపట్టిన లాక్డౌన్ పాక్షికంగా జరిగింది. పట్టణంలోని దుకాణాలు, సంతమార్కెట్, హోటళ్లు సోమవారం ఉదయం 12గంటల వరకు యథావిధిగా నడిచాయి. పట్టణ సీఐ ఎన్వీ రమణ, ఎస్ఐ రామిరెడ్డి తమ సిబ్బందితో మూసి వేయించారు. వైద్యశాలలు మాత్రమే పని చేశాయి.
ఉయ్యాలవాడ
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మండలంలో మాత్రం సోమవారం వ్యాపారులు తమ వ్యాపారాలను యథేచ్ఛగా కొనసాగించారు.
‘లాక్డౌన్కు సహకరించాలి’
శిరివెళ్ల, మార్చి 23: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని ఎస్ఐ తిమ్మారెడ్డి కోరారు. శిరివెళ్ల, యర్రగుంట్ల, గోవిందపల్లె తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలకు సూచనలు అందించారు. పాలు, కూరగాయల అంగళ్లు మినహా అన్ని దుకాణాలను మూసివేయించారు.
గూడూరు
కరోనా వైరస్ కట్టడి కోసం ఈ నెల 31వ తేదీ వరకు చేపట్టిన లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ రాజశేఖర్బాబు కోరారు. సోమవారం తహసీల్దార్ రాజశేఖర్బాబు, కమిషనర్ ప్రహ్లాద్, ఎస్ఐ నాగార్జున పాతబస్టాండులో పర్యటించి దుకాణాలను మూసివేయాలని కోరారు.