వీరికి దిక్కెవరు..?
ABN , First Publish Date - 2020-04-04T10:02:11+05:30 IST
లాక్డౌన్ అమల్లోకి వచ్చి పది రోజులు అవుతోంది. ప్రజలు గడప దాటడం లేదు. బయటకు వచ్చినా.. పని చూసుకుని నేరుగా ఇళ్లకు వెళుతున్నారు.
నిరాశ్రయులకు ఆకలి బాధ
కర్నూలు (కల్చరల్), ఏప్రిల్ 1: లాక్డౌన్ అమల్లోకి వచ్చి పది రోజులు అవుతోంది. ప్రజలు గడప దాటడం లేదు. బయటకు వచ్చినా.. పని చూసుకుని నేరుగా ఇళ్లకు వెళుతున్నారు. కానీ నా అన్నవారు లేని యాచకులు, మతి స్థిమితం లేనివారు రోడ్డు పక్కన ఆకలితో అలమటిస్తున్నారు. ఇటాంటి వారిని నిరాశ్రయుల వసతి గృహాలకు తరలిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇన్నాళ్లూ హోటళ్లు, బేకరీ నిర్వాహకులు మిగిలిన పదార్థాలను వీరికి ఇచ్చేవారు. దారిన వెళ్లేవారు డబ్బులు ఇస్తే ఆహారం కొనుక్కునేవారు.
ఇళ్లలో మిగిలిన ఆహారాన్ని కొందరు పొట్లం కట్టి ఇలాంటి వారిని వెదికి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హోటళ్లు, బేకరీలు మూతబడ్డాయి. ప్రజలు కూడా మిగిలిన ఆహారాన్ని డస్ట్బిన్లలో వేస్తున్నారు. దీంతో నిరాశ్రయుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎవరైనా డబ్బులు ఇవ్వబోతే వద్దని అంటున్నారు. తమకు తినడానికి ఏమైనా పెట్టమని వేడుకుంటున్నారు. కర్నూలు నగరంలోని ఐదు రోడ్ల కూడలి, రైల్వే స్టేషన్ రోడ్డు, బుధవారపేట, కలెక్టరేట్, సీ క్యాంపు, కొత్త బస్టాండు తదితర ప్రాంతాల్లో వీరు ఉంటున్నారు. అధికారులు స్పందించి వీరిని నిరాశ్రయుల వసతి గృహాలకు, ఆశ్రమాలకు చేర్చాల్సిన అవసరం ఉంది.