వార్డు సచివాలయానికి తాళం

ABN , First Publish Date - 2020-12-11T05:39:26+05:30 IST

కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 33వ వార్డు సచివాలయానికి గురువారం సాయంత్రం భవన యజమాని ఎన్‌.కృష్ణ తాళం వేసిన ఘటన కలకలం రేపింది.

వార్డు సచివాలయానికి తాళం
నంద్యాలలోని 33వ వార్డు సచివాలయానికి తాళం

  1. 8 నెలలుగా భవనానికి అద్దె ఇవ్వకపోవడంతో..


నంద్యాల, డిసెంబరు 10: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 33వ వార్డు సచివాలయానికి గురువారం సాయంత్రం భవన యజమాని ఎన్‌.కృష్ణ తాళం వేసిన ఘటన కలకలం రేపింది. గత 8 నెలలుగా సచివాలయానికి అద్దె చెల్లించకపోవడంతో తాళం వేశానని కృష్ణ వెల్లడించారు. నంద్యాలకు చెందిన ఎన్‌.కృష్ణ రైల్వేలో లోకో పైలెట్‌గా పని చేస్తున్నారు. బ్యాంక్‌ ద్వారా రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. ఇందులో కొంతభాగాన్ని ఈ ఏడాది జనవరిలో సచివాలయానికి అద్దెకు ఇచ్చారు. నెలకు రూ.11,500 అద్దె చెల్లింపు ప్రాతిపదికన స్థానిక మున్సిపల్‌ అధికారులు ఇంటి యజమాని కృష్ణతో మాట్లాడుకున్నారు. అయితే జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు అద్దె చెల్లించారని, మే నెల నుంచి ఇప్పటి వరకు అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని కృష్ణ తెలిపారు. గతంలోనే అద్దె విషయాన్ని స్థానిక మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్ళానని చెప్పారు. బ్యాంక్‌లోన్‌ ఈఎంఐ కట్టడానికి ఇబ్బందులు పడుతున్నానని, నెలనెలా అద్దె ఇవ్వకుంటే సచివాలయానికి తాళం వేస్తానని చెప్పగా.. తాళం వేస్తే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని మున్సిపల్‌ అధికారులు బెదిరించారని అన్నారు. దీంతో మున్సిపల్‌ ఉన్నతాధికారులతో పాటు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు, సచివాలయానికి సంబంధించి తన ఇంటి అద్దెను మొత్తం బకాయిని డిసెంబరు 10వ తేదీలోగా చెల్లించాలని, లేనిపక్షంలో తాళం వేస్తానని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎవరూ అద్దె విషయంపై స్పందించలేదని, చివరకు 1902కు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో ఇంటికి తాళం వేసినట్లు యజమాని కృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2020-12-11T05:39:26+05:30 IST