తీవ్రతను బట్టి మేలో సడలింపు
ABN , First Publish Date - 2020-04-26T18:30:38+05:30 IST
కేసుల తీవ్రతను బట్టి మేలో లాక్డౌన్ సడలింపులు ఉంటాయని..

పకడ్బందీగా విధులు నిర్వహించాలి
భయం వద్దు.. జాగ్రత్తలు పాటించాలి
డీజీపీ గౌతమ్ సవాంగ్
కర్నూలు(ఆంధ్రజ్యోతి): కేసుల తీవ్రతను బట్టి మేలో లాక్డౌన్ సడలింపులు ఉంటాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కర్నూలులో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా డీజీపీ శనివారం కర్నూలుకు వచ్చి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడానికి కారణాలు, ప్రైమరీ కాంటాక్ట్లు, రెడ్జోన్ ప్రాంతాలలో జియో ట్యాగింగ్, పోలీస్ సంక్షేమానికి తీసుకున్న చర్యలు, బందోబస్తు, వలంటీర్ల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్పీ ఫక్కీరప్ప వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ కొన్ని సూచనలు చేశారు.
55 ఏళ్లు దాటిన పోలీసులను కరోనా వైరస్ ఉన్న ప్రాంతాలలో విధులకు పంపకూడదని అన్నారు. జిల్లాలో కరోనా ప్రభావిత మండలాలను రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లుగా విభజించాలన్నారు. రెడ్జోన్లలో పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా లేదా ఏదైనా జబ్బుతో వచ్చిన వారికి కౌన్సెలింగ్ చేసి ధైర్యం చెప్పాలని సూచించారు. బీపీ, షుగర్, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనాతో మృతి చెందిన అనంతపురం ఏఎస్ఐ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఘనత ఏపీ ప్రభుత్వానిదేనన్నారు. గ్రీన్జోన్ మండలాల్లో మే 3 తర్వాత వ్యవసాయానికి సంబంధించి అనుమతులు ఇస్తామన్నారు. వైరస్ విస్తరించకుండా రంజాన్ మాసంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అడిషినల్ డీజీ, డీఐజీ, ఎస్పీ జిల్లాలో పనితీరులో ప్రతిభ కనబరుస్తున్నారని అభినందనలు తెలియజేశారు