దివ్వెల వేడుక
ABN , First Publish Date - 2020-11-13T05:30:00+05:30 IST
వెలుగుల పండుగ దీపావళిని జిల్లాలో శనివారం జరుపుకోనున్నారు.
- నేడు దీపావళి
- కొవిడ్ నిబంధనల మఽధ్యే వెలుగుల వేడుక
- తగ్గిన బాణసంచా అమ్మకాలు
- లక్ష్మీ పూజలకు మహిళలు, వ్యాపారులు సిద్ధం
కర్నూలు (కల్చరల్), నవంబరు 13: వెలుగుల పండుగ దీపావళిని జిల్లాలో శనివారం జరుపుకోనున్నారు. దీపావళి అంటే బాణసంచా. కానీ ఈ ఏడాది కొవిడ్ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (జాతీయ హరిత న్యాయస్థానం) ఆదేశాల మేరకు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలి. అదీ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే. ఈ నిబంధనతో ఈసారి దీపావళి సంబరాలు అంతంత మాత్రంగా జరిగే అవకాశం ఉంది.
సంప్రదాయ వేడుక
దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహిళలు వివిధ రకాల ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఇండ్లను శోభాయమానంగా అలంకరిస్తారు. నూతన వస్త్రాలు ధరించి ఉత్సాహంగా జరుపుకోడానికి సిద్ధమవుతున్నారు.
వెలుగుల పండుగ
దీపావళి అంటేనే దీపోత్సవం. దీపావళి రోజు దీపలక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పారదోలి, జగత్తును తేజోవంతం చేస్తుంది. సర్వ శుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. లక్ష్మి అనే మాటకు కాంతి, శోభ అని అర్థాలున్నాయి. అందుకే దీపకళికను లక్ష్మీ రూపంగా భావిస్తారు. ‘దీపేన సాధ్యతే సర్వం’ అని శాస్త్రం చెబుతోంది. దీపమున్న చోట దేవతలు నివసిస్తారని నమ్మకం. అందుకే దీపావళి రోజున ఇళ్లల్లో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతిస్తారు.
శాస్త్రీయ దృష్టిలో దీపావళి ప్రాముఖ్యత
దీపావళి పండుగలో ఆధ్యాత్మిక, పురాణ అంశాలతోపాటు శాసీ్త్రయ దృష్టితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆశ్వయుజ మాసంలో వర్షాల వల్ల నేలపై సూక్ష్మ క్రిములు చేరతాయి. సూర్యకాంతి అంతగా లేకపోవడం వల్ల ఇవి పెరిగే అవకాశం ఉంది. దీపాలు వెలిగించి, బాణసంచా కాల్పడం వల్ల సూక్ష్మక్రిములు నశించిపోతాయి.
కరోనా జాగ్రత్తలతో దీపావళి
దివ్వెల పండుగకు ఈసారి కొవిడ్ ఆటంకం వచ్చింది. నిబంధనల మేరకే బాణసంచా కాల్చాలి. వైరస్ ప్రభావానికి గురి కాకుండా పండుగ జరుపుకోవాలి. ఈ పరిస్థితుల్లో దీపావళి ఎప్పటిలా కాంతులీనే అవకాశం ఉండకపోవచ్చు. అయినా జిల్లాలో దీపావళికి పట్టణ, గ్రామీణ ప్రజలు సిద్ధమవుతున్నారు.
అనుమతి తప్పనిసరి: ఎస్పీ
కర్నూలు: బాణసంచా విక్రయించడానికి అనుమతి తప్పనిసరని, దీన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఫక్కీరప్ప హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయదారులు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. దుకాణాల వద్ద నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలన్నారు. టపాసులు విక్రయించడానికి అనుమతి తీసుకోవాలని, అక్రమంగా ఎవరైనా బాణసంచా నిల్వ ఉంచుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పండుగ రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని జాతీయ గ్రీన్ట్రిబ్యునల్ ఆదేశించిందని తెలిపారు. అది కూడా ఆకుపచ్చ టపాసులు కాల్చేందుకే అనుమతి ఉందన్నారు. కరోనా వైరస్తో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వారికి బాణాసంచా పొగ మరింత సమస్యను తెచ్చి పెట్టే ప్రమాదం ఉందన్నారు. అత్యవసర సమయంలో ప్రజలు డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.