కరోనాతో వృద్ధురాలు మృతి.. 24 గంటల తర్వాత ట్రాక్టర్లో తరలించి..
ABN , First Publish Date - 2020-08-01T19:14:48+05:30 IST
కరోనా వైరస్ పాజిటివ్తో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆమె మృతదేహం తరలింపులో వైద్య, గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతి చెందిన 24గంటల

పాములపాడు/వెలుగోడు(కర్నూలు): కరోనా వైరస్ పాజిటివ్తో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆమె మృతదేహం తరలింపులో వైద్య, గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతి చెందిన 24గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన వెలుగోడులో శుక్రవారం జరిగింది. వెలుగోడుకు చెందిన ఓ వృద్ధురాలికి బుధవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యులు హోమ్ ఐసొలేషన్లో ఉండాలని కుటుంబసభ్యులకు సూచించారు. గురువారం ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి గురైంది.
వైద్యులను సంప్రదించినా, 108 వాహనానికి సమాచారం అందించినా పీపీఈ కిట్లు లేవని చెప్పడంతో వృద్ధురాలు మృతి చెందిందని కుటుంబీకులు తెలిపారు. వృద్ధురాలి మృతిని మోతుకూరు పీహెచ్సీ వైద్యుడు కృష్ణమూర్తి రాత్రి 7గంటల తర్వాత నిర్ధారించారు. అయితే అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. శుక్రవారం తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో అమానుల్లా పంచాయతీ సిబ్బంది, గ్రామ సేవకులతో చర్చించారు. పీపీఈ కిట్లతో సిబ్బంది కరోనా మృతదేహాన్ని ట్రాక్టర్లో వెలుగోడు శివారులోని అడవిలోకి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.