చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , First Publish Date - 2020-10-04T09:28:25+05:30 IST
మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడే వారు తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు డాక్టర్ వీఆర్కే కృపాసాగర్ అన్నారు.
మహిళల సమస్యల పరిష్కారానికి అదే మార్గం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వీఆర్కే కృపాసాగర్
కర్నూలు (కల్చరల్), అక్టోబరు 3: మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడే వారు తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు డాక్టర్ వీఆర్కే కృపాసాగర్ అన్నారు. న్యాయ సేవా సదన్లో శనివారం మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా న్యాయమూర్తి డాక్టర్ వీఆర్కే కృపాసాగర్ హాజరయ్యారు.
ఆడపిల్లలకు బతికే హక్కు, చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వివరించారు. నేడు అనేక మంది మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోలేక వాటికి దూరంగా ఉంటున్నారని అన్నారు. లాక్డౌన్ సమయంలోనూ చట్టాల గురించి తెలుసుకునేందుకు అనేక మంది మహిళలు సదస్సునకు రావడం అభినందనీయమని చెప్పారు. చట్టాలపై అవగాహన పెంచుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారని అనేందుకు ఈ కార్యక్రమం నిదర్శనమని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్బాబు అన్నారు.
జాతీయ మహిళా కమిషన్ పనితీరును, బాధ్యతలను న్యాయవాది పి నిర్మల వివరించారు. వివాహాలు, విడాకులు, ఆ తర్వాత భార్య పోషణ, ఆస్తిలో మహిళల హక్కులు, కార్మిక చట్టాలను వివరించారు. ప్రాథమిక హక్కులు, విధులు, అశ్లీలత, వరకట్న హత్యలు, యాసిడ్ దాడులు, కిడ్నాపులు, వేధింపులు తదితర వాటి నుంచి రక్షణ పొందేందుకు ఏర్పాటైన చట్టాలను న్యాయవాది వి నాగలక్ష్మిదేవి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు కొవిడ్ ద్వారా మరణించిన వారి దహన సంస్కారాల గురించి మాట్లాడారు. ప్రాథమిక హక్కులను గురించి వివరించి, మహిళల చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఉద్యోగులు, ఐసీడీఎస్ యూనిట్ ఉద్యోగులు, వన్స్టాప్ సెంటర్, సీడబ్లుసీ సభ్యులు, మహిళా పోలీసులు, మహిళా న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.