ఇక ఆన్లైన్..!
ABN , First Publish Date - 2020-10-03T11:07:37+05:30 IST
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్ల రిజిస్ర్టేషన్, రెన్యువల్ వ్యవహారాలు ఇక ఆన్లైన్లో మాత్రమే జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మారిన రిజిస్ట్రేషన్, రెన్యువల్స్ విధానం
అన్ని ఆసుపత్రులు, క్లినిక్లకు వర్తింపు
స్కానింగ్ సెంటర్లు కూడా ఆన్లైన్లోనే..
కర్నూలు(హాస్పిటల్), అక్టోబరు 2: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్ల రిజిస్ర్టేషన్, రెన్యువల్ వ్యవహారాలు ఇక ఆన్లైన్లో మాత్రమే జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21 నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తులను నాలుగైదు స్థాయిలో పరిశీలిస్తారు. ఆన్లైన్లోనే ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తుదారులకు అందుతాయి. ఇప్పటివరకు నర్సింగ్ హోంలు, ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ మాన్యువల్గా చేసేవారు.
ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల యజమానులు నేరుగా డీఎంహెచ్వో కార్యాలయానికి దరఖాస్తు చేసుకునేవారు. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను తీసుకుని, డివిజన్ స్థాయి అధికారి తనిఖీకి వెళ్లేవారు. అంతా సవ్యంగా ఉంటే డీఎంహెచ్వో లైసెన్సు జారీ చేసేవారు.
ఇక అలా కుదరదు
ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోంల నిర్వాహకులు ఆన్లైన్లోనే డీఎంహెచ్వోకు ధ్రువ పత్రాలు పంపాలి. వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఊరు, వైద్యులు, బెడ్లు వివరాలతో పాటు ఫైర్ ఎన్వోసీ తదితర ధ్రువ పత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ దరఖాస్తులన్నీ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో పరిశీలిస్తారు. అన్నీ సరిగా ఉంటే డీఎంహెచ్వో నేతృత్వంలో ఆసుపత్రి పరిశీలనకు కమిటీని వేస్తారు. ఈ కమిటీ నివేదికను కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత అనుమతులు జారీ చేస్తారు. లైసెన్సులో జారీ తర్వాత ఆసుపత్రి నిర్వహణపై కూడా నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది.
రెండేళ్లుగా పెండింగ్
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వద్ద 406 ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్లు రిజిస్ర్టేషన్ అయ్యాయి. అనుమతి పొందిన డయాగ్నోస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లు 245 ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, క్లినిక్లు, పాలి క్లినిక్లు, ఫిజియోథెరపి కేంద్రాలు, డెంటల్ క్లినిక్లు, అల్ర్టాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు 651 దాకా ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను అమలు చేయాలి. జిల్లా రెన్యూవల్స్ కోసం 30 ప్రైవేటు ఆసుపత్రులు దరఖాస్తులు చేసుకున్నాయి.
ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. రిజిస్ర్టేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు ఆసుపత్రులు రెండేళ్లగా అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. 60 స్కానింగ్ కేంద్రాలు రెన్యువల్, రిజిస్ర్టేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కొత్త స్కానింగ్ మిషన్లను కొనుగోలు చేసిన ప్రైవేటు ఆసుపత్రులు రెండేళ్ల నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఆన్లైన్లో రిజిస్ర్టేషన్.. - డాక్టర్ బి రామగిడ్డయ్య
ఇక నుంచి ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు, డయోగ్నోస్టిక్ ల్యాబ్ల రిజిస్ర్టేషన్, రెన్యువల్ కోసం వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. గతంలో ఏ జిల్లాకు ఆ జిల్లా వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేవాళ్లం. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం అమలు అవుతుంది. ఈ నెల 21 నుంచి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల రిజిస్ర్టేషన్, రెన్యువల్ కోసం పీసీపీఎన్డీటీ.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రైవేటు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్ల రిజిస్ర్టేషన్, రెన్యువల్ కోసం ఛిజూజీుఽజీఛ్చిజ్ఛూట్ట్ట్చఛ్టి.్చఞ.జౌఠి.జీుఽ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి
పారదర్శకంగా అమలు చేయాలి ..- డాక్టర్ ఎస్వీ రామ్మోహన్ రెడ్డి, ఐఎంఏ, జిల్లా ప్రధానకార్యదర్శి
ప్రైవేటు ఆసుపత్రులకు ఆన్లైన్ ద్వారా లైసెన్సు జారీ చేసే ప్రక్రియను అధికారులు పారదర్శకంగా అమలు చేయాలి. రెన్యువల్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. మరి తనిఖీలు అధికారులు వచ్చి చేయాలి కదా..? ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు, రిజిస్ర్టేషన్లు త్వరగా అవుతున్నా, స్కానింగ్ కేంద్రాల రిజిస్ర్టేషన్లు మూడేళ్ల నుంచి జరగడం లేదు.